ఎన్నో కోతలు! దళారిస్థాయికి దిగజారావు..: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు
అమరావతి: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారిపోయారంటూ ట్విట్టర్ వేదికగా ఆయన విమర్శించారు. యూటర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేకపోవడం ఆయన కర్మ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

కోతలెన్నోకోశాడు అంటూ బాబుపై..
అమరావతి చుట్టూ నాలుగు గ్రామాల్లో మొసలి కన్నీరు కారుస్తూ పగటి వేషగాడిలా మారిపోయారంటే ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. ‘ఇన్ సైడర్ ట్రేడింగులో తన వాళ్లు కొన్న భూముల విలువ పెంచడానికి రాజధాని గురించి చంద్రబాబు చేసిన హడివుడి అంతా ఇంతా కాదు. హైపర్ లూప్ రవాణా, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ...ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడ నివసించే వారి ఆయుష్షు పదేళ్లు పెంచడం...లాంటి నమ్మశక్యం కాని కోతలెన్నో కోసాడు' అని విజయసాయి రెడ్డి అంటూ విమర్శించారు.

బాబూ మీరు అలాగే ఉండండి..
‘సిఎం జగన్ గారెప్పుడూ మాట తప్పరు. అది ఆయనకు వారసత్వంగా వచ్చిన స్వభావం. తమరెప్పుడూ మాట మీదుండరు చంద్రబాబూ. అది మీ నక్కజిత్తుల కపట గుణం. యూ-టర్నులతో ఎల్లకాలం ప్రజలను మోసగించలేరని తెలుసుకోలేక పోవడం మీ కర్మ. మీరు మారాలని ఎవరూ కోరుకోవడం లేదు. అలాగే ఉండండి' అని విజయసాయి వ్యాఖ్యానించారు.

పగటి వేషగాడిలా మారవు..
‘నిప్పుల కుంపటి కాదు చంద్రబాబూ. ఐదేళ్ల మీ పాలనలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదు. రావణ కాష్టంలా మండించావు రాష్ట్రాన్ని. అందుకే ప్రజలు తరిమి కొట్టారు. అమరావతి చుట్టూ 4 గ్రామాల్లో మొసలి కన్నీరు కురిపిస్తూ పగటి వేషగాడిలా మారిపోయావు. రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారి పోయావు' అంటూ విరుచుకుపడ్డారు విజయసాయి.
దిశ అధికారులకు అభినందనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ దిశ చట్టం2019 అమలుకు ప్రత్యేక అధికారులుగా నియమితులైన కృతికా శుక్లా, దీపిపాలకు విజయసాయి రెడ్డి అభినందనలు తెలిపారు. వీరిద్దరి నేతృత్వంలో దిశ చట్టం పూర్తి స్థాయిలో అమలు
అవుతుందని ఆకాంక్షించారు. దిశ చట్టం అమలు కోసం ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారిణి దీపికలను దిశ చట్టం ప్రత్యేక అధికారిణిలుగా ఏపీ ప్రభుత్వం నియమించింది.












Click it and Unblock the Notifications