కేసీఆర్ అలా చేస్తే..జగన్ ఊరుకుంటారా : వైసిపి 22 సీట్లు గెలిస్తే.. : విజయశాంతి కీలక కామెంట్లు..!
లోక్సభ ఎన్నికల్లో టిఆర్యస్..వైసిపి గెలుపు పై విజయశాంతి కీలక కామెంట్లు చేసారు. తక్కువ సీట్లున్న కేసీఆర్ 16 సీట్లు గెలిచి చక్రం తిప్పితే.. 22 సీట్లు గెలుస్తానంటున్న జగన్ చూస్తూ ఉరుకుంటారా అని విజయ శాంతి ప్రశ్నించారు. 16 సీట్లకే కేసీఆర్ ఇన్ని మాటలు చెబితే..ఎక్కువ సీట్లు వచ్చిన మిగిలిన ప్రాంతీయ పార్టీల నేతలు ఏం చేయాలని విజయశాంతి ప్రశ్నించారు.
కేసీఆర్ చక్రం తిప్పితే..జగన్
లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ అంటున్నారని... మరి ఏపీలో 20-22 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న జగన్ ఏం తిప్పాలని కాంగ్రెస్ నేత..ప్రముఖ సినీ నటి విజయశాంతి ప్రశ్నించారు. తక్కువ సీట్లున్న గులాబీ పార్టీ, ఎక్కువ సీట్లు గెలిచే పార్టీని ఎలా శాసిస్తుంది.. కేసీఆర్ చక్రం తిప్పేదాకా జగన్ ఊరుకుంటారా అంటూ ఆసక్తి కర చర్చకు తెర తీసారు.కేసీఆర్..జగన్ ఓ అవగాహనకు వచ్చినా.. తామూ ఎక్కువ సీట్లు సాధిస్తామంటు న్న మమత, మాయావతి వంటి సీనియర్ నేతలు టీఆర్ఎస్ చెప్పుచేతల్లో పనిచేస్తారా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రశ్నలకు దొరకని సమాధానమేనని విమర్శించారు.
విజయశాంతి వ్యాఖ్యల పరమార్ధం..
కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో ఏపి నుండి జగన్ చేరుతారని..అక్కడి ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తా రని కొద్ది రోజుల క్రితం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ఇటు ఏపి ఎన్నికల ప్రచారంలో జగన్ సైతం ఏపిలోని 25 సీట్లు..తెలంగాణలోని 17 సీట్లు మొత్తం 42 మంది కలిసి ఏపికి ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెచ్చి ఏపికి హోదా తెస్తామని చెబుతున్నారు. తమకు కేసీఆర్ తో పొత్తు లేదని..అదే సమయంలో హోదా కోసం మద్దతిస్తే స్వీకరిస్తామని స్పష్టం చేసారు. ఇక, జాతీయ స్థాయిలో ఎవరైతే ఏపికి హోదాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారో వారికే తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు సీట్లు..చక్రం తిప్పటం గురించి విజయశాంతి చేసిన వ్యాఖ్యలతో మరో సారి ఏపిలో చర్చకు కారణమవుతోంది.
ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)
చంద్రబాబుకు అవకాశంగా..
తెలంగాణ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏపి ఎన్నికల ప్రచారం లో టిడిపి అధినేత చంద్రబాబు అవకాశం గా మలచు కుంటున్నారు. ఏపి ప్రజలను అవమానించి..ఏపికి రావాల్సిన ప్రయోజనాలను దెబ్బ తీసిన కేసీఆర్ తో జగన్ పొత్తు పెట్టుకుంటున్నారని..జగన్ కు ఓటు వేస్తే అది కేసీఆర్..మోదీకి వేసినట్లేనని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇదే అస్త్రంగా జగన్ ను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వరుసగా తెలంగాన నేతలు జగన్ ను ఉద్దేశించి చేస్తున్న ప్రతీ కామెంట్ ను టిడిపి తమకు అనుకూలంగా మలచుకొనేందుకు సిద్దంగా ఉంది. ఇక, ఇప్పుడు విజయ శాంతి చేసిన వ్యాఖ్యల పై టిఆర్యస్ నేతలు ఎలా స్పందిస్తారో..అవి ఏపి లో ప్రధానంగా వైసిపి పై ఎలాంఇ ప్రభావం చూపుతాయో చూడాలి.