ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కల్యాణ్నే ప్రశ్నించాడు: ఎందుకు?
విశాఖపట్నం: ప్రశ్నిస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్నే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించారనే సందేహం కలగడం సహజం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాపై తాము ఇంత కాలం చేస్తున్న పోరాటాన్ని హైజాక్ చేస్తారనే ఉద్దేశంతోనే ఆయన ప్రశ్నించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రత్యేక హోదాపై గత కొంత కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఒక్క తిరుపతి సభతో పవన్ కల్యాణ్ ఆ పోరాటాన్ని హైజాక్ చేశారనే మాట వినిపిస్తోంది. దీంతో విజయ సాయి రెడ్డి ఆయనను విమర్శించి ఉండవచ్చునని అంటున్నారు. పవన్ కల్యాణ్కు ప్రత్యేక హోదా ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ఆయన అడిగారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎంపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి శనివారం విశాఖపట్నం వచ్చారు. అభిమానులు ఏర్పాటు చేసిన మోటార్ సైకిల్, కార్ల ర్యాలీలో ఆయన సింహాచలం వెళ్లి అప్పన్న దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
విశాఖపట్నం, తిరుపతి బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారని ఆయన అన్నారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ఇచ్చిన హామీలపై రెండున్నరేళ్ల తర్వాత మేల్కొన్న పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం తప్పు అని, పోరాటం చేస్తానని అంటున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
రాష్ట్రం విడిపోయిన రోజు నుంచీ ఈ రోజు వరకూ ఎపికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారి కోరిక వచ్చే ఎన్నికల్లో నెరవేరుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications