కిరణ్ అప్పుడేం చేశారు, బాబు వల్లే: ఢిల్లీలో విజయమ్మ
న్యూఢిల్లీ: విభజన నిర్ణయం సమయంలో పెదవి విప్పని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెసు నేతలు ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ అంటున్నారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ వల్లనే కేంద్రం విభజనకు ధైర్యం చేయగలిగిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే కేంద్రం విభజనకు ధైర్యం చేయగలిగిందన్నారు. కిరణ్ విభజన నిర్ణయం సమయంలో సమైక్యవాదం వినిపించలేదని, ఇప్పుడు విభజన వద్దంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేశారు. విభజన ద్వారా వచ్చే సమస్యలపై ప్రజలకు జవాబు చెప్పకుండా ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆంటోని కమిటీతో ఎలాంటి న్యాయం జరగదన్నారు. విభజిస్తే పోలవరానికి నీళ్లు ఎక్కడి నుండి వస్తాయో చెప్పాలన్నారు.
కాంగ్రెసు నిర్ణయంతో ఇరు ప్రాంతాల్లో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనను ఎట్టి పరిస్థితుల్లోను తెలుగు ప్రజలు అంగీకరించరన్నారు. సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులు రాజీనామాలు చేయడం లేదని, వారికి రాష్ట్రం కంటే పదవులే ముఖ్యమని మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న ఇరు ప్రాంత ప్రజల మధ్య విభజనతో అంతరం పెంచారన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదును అందరం కలిసి కట్టుకున్నామని ఇప్పుడు వెళ్లిపోమంటే ఎలా అన్నారు. హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం ఒకే ప్రాంతానికి ఇస్తే మరో ప్రాంతం నష్ట పోవాలా అన్నారు. కర్నాటక, తమిళనాడులను విభజించే సాహసం చేయని వారు తెలుగు వారిని ఎందుకు విడదీస్తున్నారన్నారు. విభజనకు ముందు కాంగ్రెసు, టిడిపిలు పెదవి విప్పలేదని మండిపడ్డారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. తెలుగు వారి మనోభావాలను అర్థం చేసుకోవాలన్నారు.