చిట్టినాయుడు.. నీతో చర్చ ఏంటి ఛండాలంగా: సాయిరెడ్డి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగారెడ్డి గూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాలపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటూ టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో లోకేష్ కూడా జగన్ కు సవాళ్ళు విసురుతూ రాజాకీయాలను వేడెక్కిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. చిట్టినాయుడు, మాలోకం అంటూ లోకేష్ ను ఎద్దేవా చేశారు.

చిట్టి నాయుడు వాలకం అలా ఉంది: సాయిరెడ్డి
కాపీలుకొట్టి పాసైనోడు, డిస్టింక్షన్ సాధించిన వాళ్లను మళ్లీ పరీక్ష రాద్దాం రెడీనా అని సవాలు చేసినట్టుంది చిట్టి నాయుడు వాలకం అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఎవరో ఫీజు కడితే చదివినోడివి. తండ్రి సీఎం అయినందున ఎకాఎకిన మినిష్టర్ అయిపోయావు అంటూ ఎద్దేవా చేశారు. మంగళగిరిలో పోటీ చేస్తే ప్రజలు నేలకేసి బాదారు . నీతో చర్చ ఏంటీ చంఢాలంగా! అంటూ లోకేష్ సవాల్ ను తీసి పారేశారు. నీతో చర్చ పెట్టాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని తేల్చి చెప్పారు.

మాలోకానికి ఈమధ్య ఉలుకెక్కువైంది: విజయ సాయిరెడ్డి
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్టుషాపులు పెట్టిన పాపం టిడిపిదే అని మండిపడిన విజయసాయిరెడ్డి మాలోకానికి ఈమధ్య ఉలుకెక్కువైంది. రాత్రిపూట కుక్కలు మొరిగితే డిటెక్టివ్లాగా టార్చ్లైట్వేసుకుని వెతికేస్తున్నాడు అంటూ లోకేష్ ను టార్గెట్ చేశారు. గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసింది ఎవరు? అని ప్రశ్నించారు విజయ సాయి రెడ్డి. చావులన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ రాళ్లు కొడుతున్నారు అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 వేల బెల్టు షాపులు పెట్టించిన పాపం మీదే అంటూ విజయసాయి రెడ్డి ఎదురు దాడి చేశారు.

జనాలు మాత్రం మళ్ళీ బండకేసి ఉతుకుతారు; వైసీపీ ఎంపీ
అంతటితో వదలని విజయసాయిరెడ్డి మరో పోస్ట్ పెట్టి లోకేష్ ను, చంద్రబాబును టార్గెట్ చేశారు. ఈసారి పెగాసస్ పై విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి పెగాసస్తో ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడిన నేరం నుంచి తండ్రీకొడుకులు తప్పించుకోలేరు అని పేర్కొన్నారు. పోలీసు ఇన్వెంటరీలో నమోదు చేయకున్నా పెగాసస్ వాడింది వాస్తవం అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. నిండుసభలో బెంగాల్ సీఎం మమత ఊరికే అనరు కదా అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి తప్పించుకోవడానికి వ్యవస్థలపై ఆశలు పెట్టుకోవచ్చు కానీ జనాలు మాత్రం మళ్ళీ బండకేసి ఉతుకుతారు అని తేల్చి చెప్పారు.

చిట్టి నాయుడూ! అబద్ధాలు వల్లెవేయడంలో తండ్రిని మించిపోయావు
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదని ఆయన తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్మడం లేదని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు మమతా బెనర్జీ చేసిన పెగాసస్ వ్యాఖ్యలకు లోకేష్ క్లారిటీ ఇచ్చిన సమయంలోనూ చిట్టి నాయుడూ! అబద్ధాలు వల్లెవేయడంలో తండ్రిని మించిపోయావు మండిపడ్డారు. మమత అసలు పెగాసెస్పై మాట్లాడనే లేదా? పెగాసెస్పై బెంగాల్ అసెంబ్లీలో మమత చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చింది. అప్పుడప్పుడు ఇంగ్లీష్ పేపర్లు కూడా చూడు. ఎల్లో మీడియాను నమ్ముకుని బావిలో కప్పలా బతకొద్దు అంటూ లోకేష్ పై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications