అది తప్పా ..ఒప్పా : ఎలా మద్దతిస్తారు..జగన్ సమాధానం చెప్పాలి: నిలదీసిన విజయ శాంతి ..!
సినీ నటి..కాంగ్రెస్ నేత విజయశాంతి వైసిపి అధినేత జగన్ను నిలదీసారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మద్దతిస్తున్న జగన్ ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపిలో తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసి ఫిరాయించేలా చేసారని ఆందోళన చేసిన జగన్..ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నది తప్పా..ఒప్పా చెప్పాలని కోరారు.
జగన్ కు రాములమ్మ ప్రశ్నలు..
వైసిపి అధినేత జగన్కు కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఫెడరల్ ఫ్రంట్ విషయం లో జగన్ను నిలదీసారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతిస్తున్నట్టు చెబుతున్నారని.. ఆయన ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతున్న విజయ శాంతి గతంలోనూ జగన్ ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్తో జగన్ సన్నిహితంగా ఉండటం పైనా ఎన్నికల సమయంలో ప్రశ్నించారు. చంద్రబాబు మిత్రపక్షంగా ఉండటంతో..విజయ శాతం అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్యస్లో చేరటం...సీఎల్పీని సైతం టిఆర్యస్ లో విలీన ప్రతిపాదన పైన చర్చ జరుగుతుఉండటంతో విజయశాంతి ఇప్పుడు జగన్ అదే అంశం పై నిలదీస్తున్నారు.
విజయశాంతి ట్వీట్ ఇలా....
కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్కు మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ గారు చెబుతున్నారు. ఈ సందర్భంగా నేను జగన్ గారిని అడిగేది ఒకటే... వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారనే కారణంతో గత రెండేళ్ల పాటూ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ఏపీలో పార్టీల ఫిరాయింపుపై తిరుగుబాటు చేస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలు పెడుతున్న కేసీఆర్ గారితో కలిసి, జాతీయ స్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని జగన్ గారు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం. ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పవుతుందో జగన్ గారు వివరణనివ్వాలి. కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం జగన్ గారి దృష్టిలో తప్పా, ఒప్పా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.. అంటూ విజయశాంతి తన ట్వీట్లో పేర్కొన్నారు.
వైసిపి నేతలు స్పందిస్తారా..
విజయశాంతి గతంలో ట్విట్టర్ ద్వారా ప్రస్తావించిన అంశాలకు..విమర్శలకు వైసిపి నేతలు సమాదానం ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల పైన విజయ శాంతి నేరుగా జగన్ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేసారు. కేసీఆర్కు ఎలా మద్దతిస్తారంటూ ప్రశ్నించారు. మరి, ఇప్పుడైనా వైసిపి నేతలు విజయశాంతి ప్రశ్నలకు సమాధానం ఇస్తారా లేక పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది చూడాలి.