విజయవాడలో తొలి కరోనా మరణం వెనుక ? కారణాలు బయటపెట్టిన కమిషనర్..
ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కు చేరింది. ఈ నేపథ్యంలో విజయవాడలో పరిస్ధితులను సమీక్షించేందుకు తాజాగా నగరంలో పర్యటించిన కమిషనర్ ద్వారకా తిరుమలరావు కరోనా కారణంగా తొలి మరణం చోటుచేసుకోవడానికి దారి తీసిన పరిస్ధితులను వివరించారు. కరోనా సోకిన కుమారుడి నుంచి తండ్రికి ఎలా సోకింది, మరణానికి కారణాలను వెల్లడించారు..

బెజవాడలో ఏం జరిగిందంటే...
ఏపీలో మార్చి 30న తొలి కరోనా వైరస్ మరణం విజయవాడలో చోటుచేసుకుంది. పారిస్ నుంచి వచ్చిన కుమారుడికి కరోనా లక్షణాలు బయటపడటంతో హోం క్వారంటైన్ లో ఉంచారు. ఆ తర్వాత కుమారుడు కోలుకుంటుండగా.. అతని తండ్రి మాత్రం మృత్యువాత పడ్డారు. దీనిపై సమీక్ష నిర్వహించిన విజయవాడ నగర పోలీసు కమిషనర్ మరణానికి గల కారణాలు బయటపెట్టారు. కుమారుడికి కరోనా ఉందన్న విషయం తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇతరత్రా వ్యాధులు ఉండటంతోనే బాధితుడు చనిపోయినట్లు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

ఎవరినీ తప్పుబట్టడం లేదంటూనే..
విజయవాడలో కరోనా వైరస్ లక్షణాలతో తొలి మరణం చోటు చేసుకున్న తర్వాత దాన్ని నిర్దారించేందుకు సమయం పట్టిందని, మృతుడికి బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా ఉండటమే దీనికి కారణమని కమిషనర్ వెల్లడించారు. మృతుడి మరణం తర్వాత కుటుంబ సభ్యులను పూర్తి స్దాయిలో క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో తాము ఎవరినీ తప్పుబట్టడం లేదని, ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి క్వారంటైన్ లో చేరారని కమిషనర్ కోరారు.

ప్రజల్లో ధైర్యం నింపేందుకు..
కరోనా వైరస్ సోకి మృతిచెందిన వ్యక్తి నివసించిన కుమ్మరిపాలెం సెంటర్ ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు.. ప్రజలలో ధైర్యంనింపేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. నిన్నటి వరకూ నగరంలో 16 కేసులు నమోదైతే వాటిలో 11 ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మిగతా ఐదుగురు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. ఢిల్లీ సదస్సు కు వెళ్ళి వచ్చిన వారు, వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరిక్షలు నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు.
Recommended Video

బెజవాడలో కర్ఫ్యూ, రెడ్ జోన్లు..
విజయవాడలో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో నగరంలో ఒక్కో ప్రాంతం కర్ఫ్యూ, రెడ్ జోన్ పరిధిలోకి తెస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో షాపింగ్ సమయాల తగ్గింపుతో పాటు మరిన్ని కఠిన చర్యలు చేపడుతున్నారు. పరిస్ధితి ఇంకా ముదిరితే నగరం మొత్తం పూర్తి స్దాయిలో కర్ఫ్యూ విధించే అవకాశాలు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పరిస్ధితి అంతవరకూ రాకముందే ఢిల్లీ వెళ్లి వచ్చిన వారంతా క్వారంటైన్ కు రావాలని పోలీసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications