హాట్ స్పాట్ గా విజయవాడ- పరిస్ధితి ప్రమాదకరం- ఇతర ప్రాంతాలతో రాకపోకలు రద్దు...
విజయవాడ నగరంలో కరోనా వైరస్ కేసుల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పటికే 250కి చేరువవుతున్న కేసులతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. కానీ జనం మాత్రం ఇంకా రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో నగరం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలను సైతం అధికారులు రద్దు చేశారు.

కరోనా హాట్ స్పాట్ గా విజయవాడ...
ఏపీ వాణిజ్య రాజధాని విజయవాడ నగరం కరోనా వైరస్ వ్యాప్తితో అల్లాడుతోంది. నగరంలో కొందరు చేసిన తప్పిదాలకు అందరూ శిక్ష అనుభవించక తప్పని పరిస్ధితి నెలకొంటోంది. భారీగా పెరుగుతున్న కేసులతో అధికారులు విజయవాడను హాట్ స్పాట్ గా ప్రకటించారు. బడుగు వర్గాలు ఎక్కువగా నివసించే కృష్ణలంక, మాచవరం ప్రాంతాల్లో అత్యధిక కేసులు నమోదు కావడంతో అధికారులు ఇక్కడ రెడ్ జోన్ నిబంధలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఒక్క కృష్ణలంక ప్రాంతంలోనే 85 కేసులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగకమానదు.

కంటైన్ మెంట్ జోన్ స్ధాయికి...
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన ఓ లారీ డ్రైవర్ పశ్చిమబెంగాల్ వెళ్లి వచ్చాక స్ధానికంగా ఉన్న ఇళ్లలో తిరుగుతూ పేకాట ఆడాడు. ఈ ఒక్కడి కారణంగా 24 మందికి వైరస్ సోకింది. అలాగే మాచవరంలో టీ అమ్ముకునే వ్యక్తి నుంచి ఏకంగా 36 మందికి వైరస్ వ్యాపించింది. ఇప్పుడు ఈ రెండు చోట్ల సామాజిక వ్యాప్తి కారణంగా దాదాపు 200 మంది బాధితులుగా మిగిలారు. అధికారులు ఎంత నిఘా పెట్టినా పట్టించుకోకపోవడం, బస్తీల్లో ఇంటింటికీ తిరగడం వంటి కారణాలతో కేసుల సంఖ్యలో పెరుగుదల ఆగడం లేదు.

విజయవాడతో తెగిన సంబంధాలు...
విజయవాడ నగరం నుంచి నూజివీడు, బందరు వంటి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లిన కూరగాయల వాడకం ద్వారా కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు అనుమానాలు రావడంతో అధికారులు.. జిల్లాలోని ఇతర ప్రాంతాలతో విజయవాడకు రాకపోకలు నిలిపివేశారు. దీంతో మార్కెట్ కోసం విజయవాడపైనే ఆధారపడే జిల్లాలోని వ్యాపారుల పరిస్ధితి దారుణంగా తయారైంది. ఇప్పటికే నగరంలో వారాంతపు నాన్ వెజ్ అమ్మకాలతో పాటు షాపింగ్ సమయాలను మించి రాకపోకలను కూడా నిలిపివేశారు. అయినా వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. వైరస్ కారణంగా ఇప్పటికే 8 మంది చనిపోయారు. ఇదే పరిస్ధితి కొనసాగితే నగరంలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించి ఇళ్ల వద్దకే నిత్యావసరాలు పంపాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications