విజయవాడలో రేపు అస్సలు బయటికి రావొద్దు..! తీవ్ర హెచ్చరిక..!
ఏపీలో మొంథా తుపాను ప్రభావం మొదలైంది. రేపటి కల్లా ఇది మరింత తీవ్రం కానుంది. ఎల్లుండి కాకినాడ వద్ద ఇది తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే విజయవాడ నగరం పరిధిలో భారీ వర్షాలు తప్పేలా లేవు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా అధికారులు ఇవాళ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలతో కూడిన విజయవాడ నగరంలో ప్రజలు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందేనంటున్నారు.
మొంథా తుఫాను ప్రభావం కారణంగా రేపు (28 అక్టోబర్) జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా విజయవాడ నగరం పరిసర ప్రాంతాలలో సుమారు 162 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని, అలాగే అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని ఎన్టీఆర్ జిల్లా అధికారులు సూచించారు.

ఇది ప్రజలకు అసౌకర్యం లేకుండా ఉండటానికి, అలాగే ప్రజా భద్రతను కాపాడటానికి అవసరమని వారు స్పష్టం చేశారు. నగర పరిధిలో ఉన్న ప్రజలకు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నారు.ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా తలెత్తినట్లయితే జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ (9154970454)ను సంప్రదించాలని కోరుతున్నారు.

మరోవైపు మొంథా తుపాను నేపధ్యంలో ఇరిగేషన్, శాఖ ఉన్నతాధికారులతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారుు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా లో వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని, బుడమేరు డైవర్షన్ ఛానెల్ పై నిరంతర నిఘా ఉండాలని ఆదేశించారు. వెలగలేరు రెగ్యులేటర్ నుండి ఎనికేపాడు యూటీ వరకు విజయవాడ నగర పరిధిలో ఓల్డ్ బుడమేరు మొత్తం ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలన్నారు. ఎర్ర కాలువ, యనమదురు డ్రైన్, బురద కాలువ, సుద్ద వాగు, ఏలేరు రిజర్వాయర్, రైవాడ కాలువ వంటి వాటిపై నిరంతర నిఘా పెట్టాలన్నారు.












Click it and Unblock the Notifications