కార్పోరేటర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఉద్యోగులు, సిమ్ కార్డు, ట్రూ కాలర్ యాప్తో ఇలా..
విజయవాడ: విజయవాడ కార్పోరేషన్లో ఇద్దరు ఉద్యోగులు కార్పోరేటర్ల పేరుతో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అధికార పార్టీకి చెందిన కార్పోరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఉద్యోగులు ఈ తతంగానికి పాల్పడ్డారని తేలింది.. అయితే తమ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న శ్రావణి అనే కార్పోరేటర్ షాక్కు గురయ్యారు.
విజయవాడ కార్పోరేషన్లో ఇద్దరు ఉద్యోగులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకొన్నారు. భవనాల నిర్మాణం కోసం తమ వద్దకు వచ్చే ధరఖాస్తుల ఆధారంగా ఉద్యోగులు స్థానిక కార్పోరేటర్ల పేరుతో ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేసే దందాను ప్రారంభించారు.
మహిళా కార్పోరేటర్ల మాదిరిగా మాట్లాడేందుకు వీలుగా ఓ మహిళను కూడ నియమించుకొన్నారు. ఇధ్దరు కార్పోరేషన్ ఉద్యోగులతో పాటు మరో ఇద్దరిని కూడ నియమించుకొన్నారు. ఆయా వార్డుల పరిధిలో అనుమతుల విషయంలో ఉద్యోగులు డబ్బులు వసూలు చేసినట్టు 52వ, కార్పోరేటర్ శ్రావణి దృష్టికి వచ్చింది.
సుమారు రెండేళ్ళుగా కార్పోరేషన్ ఉద్యోగులు ఈ దందాకు పాల్పడ్డారని శ్రావణి చెబుతున్నారు. కార్పోరేటర్ శ్రావణి పేరుతో సిమ్ కార్డును తీసుకోవడమే కాకుండా ఆమె ఫోటోతో ట్రూ కాలర్లో శ్రావణి ఫోటోను ఫీడ్ చేశారు.
నిజంగా కార్పోరేటర్ ఫోన్ చేసినట్టుగా నమ్మించేందుకు ఈ ప్రయత్నం చేశారు. అయితే వారం రోజుల క్రితం శర్మ అనే వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేసిన విషయాన్ని కార్పోరేటర్ శ్రావణి దృష్టికి వచ్చింది.
ఈ విషయమై శ్రావణి శర్మ అనే వ్యక్తిని పిలిపించి మాట్లాడింది. ఈ డబ్బుల వసూలుతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే కార్పోరేటర్ ఫోన్ చేసిందని తనను నమ్మించారని శర్మ తనకు చెప్పారని కార్పోరేటర్ శ్రావణి మీడియాకు చెప్పారు.
ఈ విషయం తమ దృష్టికి రాగానే కార్పోరేషన్ ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె చెప్పారు.కార్పోరేషన్ ఉద్యోగులు ఈ ఒక్క వార్డులోనే డబ్బులను వసూలు చేశారా, లేక మిగిలిన వార్డుల్లో కూడ ఇలానే చేశారా అనే విషయమై ఆరా తీస్తున్నారు.