బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే భక్తులకు కీలక అలెర్ట్.. వాటిపై నిషేధం!
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో భక్తులు మరియు సిబ్బందికి ముఖ్యమైన అలెర్ట్ . ఆలయ భద్రత, పవిత్రత మరియు భక్తుల ఏకాగ్రతను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.ఇకపై ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధం. ఆదివారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది.
దుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్ల వాడకం
దుర్గమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రముఖ ఆలయాల్లో ఒకటి. రోజుకు వేలాదిమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇటీవలి కాలంలో కనక దుర్గమ్మ ఆలయంలో సెల్ఫోన్ల వినియోగం అత్యధికంగా పెరిగింది. భక్తులు దర్శనం సమయంలో ఫోటోలు, వీడియోలు, రీల్స్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆలయ వాతావరణానికి భంగం కలుగుతుందని అధికారులు గమనించారు. గర్భాలయం, రాజగోపురం, క్యూలైన్లు, ఉత్సవమూర్తుల ప్రాంతాల్లో ఫోన్ల వాడకంతో ఇతరభక్తులకు అసౌకర్యం కలుగుతోంది.

కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థాన పాలకమండలి
ఈ నేపథ్యంలో దేవస్థానం పాలక మండలి సమావేశంలో విస్తృతంగా చర్చించి, సెల్ఫోన్లపై పూర్తి నిషేధం విధించారు. కనకదుర్గమ్మ ఆలయ ఈవో శీనానాయక్ మాట్లాడుతూ, భక్తులందరూ దర్శనానికి వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్లను ఇంట్లోనే ఉంచి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ స్కానింగ్ పాయింట్ల వద్ద సిబ్బంది కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నారన్నారు. ఫోన్లతో వచ్చిన భక్తులను వెనక్కి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
సెల్ ఫోన్ లపై నిషేధం
ఆలయ ఉద్యోగులు, గుమాస్తాలు, కౌంటర్ సిబ్బంది,సెక్యూరిటీ, హోంగార్డు, ఎస్పీఎఫ్ సిబ్బంది, భక్తులందరూ ఎవరికీ ఆలయ ప్రాంగణంలో సెల్ ఫోన్ అనుమతి లేదన్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సెల్ఫోన్లను ఉపయోగించవచ్చని, శానిటేషన్ సూపర్వైజర్లు మరియు కొందరు సెక్యూరిటీ సిబ్బందికి పరిమిత అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆలయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.
భక్తుల్లో మిశ్రమ స్పందన
ఈ నిర్ణయం పట్ల భక్తుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఇది సరైన నిర్ణయమని చెబుతుండగా, మరికొందరు అత్యవసర సమయాల్లో ఇబ్బంది ఎదురవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఆలయ పవిత్రతను కాపాడేందుకు ఈ నియంత్రణ అవసరమని దేవస్థానం స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications