విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ రెడీ- ట్రయల్ రన్ విజయవంతం- సెప్టెంబర్ 4న ప్రారంభం...
విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాష్ట్రంలో అత్యంత పొడవైన కనకదుర్గ ఫ్లైఓవర్ తాజాగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. ఈ మధ్యే రెండుసార్లు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్మించారు. రెండు రోజులుగా సాగుతున్న ట్రయల్ రన్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు గుర్తించారు. దీంతో ప్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమై నత్తనడకన సాగిన ఈ ఫ్లైఓవర్ వైసీపీ ప్రభుత్వ రాక తర్వాత శరవేగంగా సాగింది. తాజాగా కరోనా కారణంగా కొన్ని ఇబ్బందులు ఎధురైనా ప్రభుత్వం వాటిని అధిగమించి నిర్మాణ పనులకు సహకరించింది. దీంతో తాజాగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్లైఓవర్ను సెప్టెంబర్ 4న ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ ఇవాళ ప్రకటించారు. ప్రస్తుతం ఇంకా మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను పూర్తి చేసి వచ్చే నెల 4న ఈ ఫ్లైఓవర్ ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కనకదుర్గ వారధి, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ను వచ్చే నెల 4న ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. వచ్చే నెల 4న ఆర్ అండ్ బీ డిపార్ట్మెంట్కు చెందిన 13 వేల కోట్ల రూపాయల పనులకు కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే రోజు ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు.