తెలుగు విద్యార్థి సాయి ఆకాశ్ సంచలనం: అమెరికా ఏసీటీ పరీక్షలో వరల్డ్ ఫస్ట్ ర్యాంక్
విజయవాడ: అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఏసీటీ (అమెరికన్ కాలేజ్ టెస్ట్) పరీక్షలో తెలుగు విద్యార్థి అరుదైన రికార్డు సాధించాడు. విజయవాడ సూపర్విజ్ అధినేత గుప్తా కుమారుడు మామిడి సాయిఆకాశ్ ఏసీటీ పరీక్షలో 36 పాయింట్లకు 36 పాయింట్లు సాధించి ప్రపంచ ఫస్ట్ ర్యాంకుతో సత్తా చాటాడు. దీంతో ప్రపంచంలోనే ప్రతిష్ఠాకరమైన ప్రముఖ 16 విదేశీ విశ్వవిద్యాలయాలు భారీగా స్కాలర్షిప్లతో అడ్మిషన్ ఇస్తామంటూ సాయికి ఆఫర్లపై ఆఫర్లు ప్రకటించాయి.
విజయవాడకు చెందిన 17 ఏళ్ల మామిడి సాయి ఆకాష్ హైదరాబాద్లో ఫిట్జీ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసుకుని ఇంజనీరింగ్ కోర్సు యూఎస్లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. అతడి మేధాశక్తిని గుర్తించిన 16 విశ్వవిద్యాలయాలు స్కాలర్షిప్లు అందించి మరీ చేర్పించుకుంటామంటూ రెడ్కార్పెట్తో స్వాగతం పలికారు.
వీటిల్లో స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏల్, ప్రిన్స్టన్, కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ, బ్రౌన్, డార్జ్మౌత్, డ్యూక్, మిషిగాన్, జార్జియా టెక్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, ఇల్లినాయిస్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో, రైస్ వంటి వర్సిటీలు సాయిఆకాశ్ ప్రవేశానికి ఆహ్వానం పలికాయి. కాగా, ఇలాంటి అవకాశం దేశంలో ఇంతకు ముందెవరికీ రాలేదు.
కాగా, ఎంతో ప్రతిష్ఠాకరమైన పోటీ పరీక్ష ఎస్ఎటి-2లో ఫిజిక్స్, మ్యాథ్స్ విభాగాల్లో ఒక్కోదాంట్లోంచి 800 మార్కులకు గాను ప్రశ్నలుంటాయి. అలాంటి ఈ కఠినతరమైన పరీక్షలో సాయి ఆకాష్ నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ఆసక్తికరమేమిటంటే ఇంటర్నెట్ వ్యవస్థాపకులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వ్యవస్థాపకులు చదివిన ప్రపంచ నెంబర్-1 స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఈ ఆకాష్ను కంప్యూటర్ సైన్స్లో చేర్చుకుంటామంటూ స్వాగతం పలికింది.
భవిష్యత్లో మంచి వ్యాపారవేత్తగా రాణించాలనే కోరికతో ఉన్న ఆకాష్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియాలోనున్న స్టాన్ఫోర్డ్ను ఎంచుకున్నాడు. మూడు దశాబ్దాలుగా వేలాది మంది సీఏలను ఈ ప్రపంచానికి అందించిన సూపర్విజ్ అధినేత ఎంఎ గుప్తా, లక్ష్మిల ఏకైక తనయుడు ఆకాష్. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. ఈ పరిణామాలతో తనకు జీవిత సాఫల్య పురస్కారాలు వచ్చినంత ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా సాయి ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో విద్య పూర్తి చేసినా, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తగా మనదేశంలోనే స్థిరపడి దేశసేవ చేస్తానన్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ను ఎంచుకున్నట్లు తెలిపారు. సమావేశంలో సాయిఆకాశ్ మెంటర్ సుభాష్బాబు పాల్గొన్నారు.