మళ్లీ కేశినాని నాని యాక్టివ్- అటు వైసీపీకీ, ఇటు టీడీపీలో ముగ్గురికీ చెక్ ? కొత్త వ్యూహాలతో..!
విజయవాడలో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న కేశినేని నాని ఓ దశలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సంకేతాలు ఇచ్చేశారు. కానీ ఆయన్నే నమ్ముకుని ఉన్న టీడీపీ నేతలు తిరిగి ఒత్తిడి చేయడంతో ఆయన మనసుమార్చుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి టీడీపీలోనే యాక్టివ్ అవుతూ ప్రత్యర్ధులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఓవైపు వైసీపీనీ, మరోవైపు టీడీపీలోని అంతర్గత ప్రత్యర్ధుల్ని ఎదుర్కొనేందుకు నాని రచిస్తున్న వ్యూహాలు ఆసక్తి రేపుతున్నాయి.

విజయవాడ ఎంపీ కేశినేని నాని
2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా రెండోసారి ఎన్నికైన కేశినేని నానిని టీడీపీలో అంతర్గత పోరు వేధిస్తోంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరున్న కేశినేని తీరుపై టీడీపీలో సీనియర్లుగా ఉన్న దేవినేని ఉమ, బోండా ఉమ, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు నేతలు మండిపడుతుంటారు. అయితే వీరి తర్వాతే టీడీపీలోకి వచ్చిన కేశినేని నాని వరుస విజయాలతో కుదురుకున్నా.. వీరిని ఎదుర్కోవడం మాత్రం కష్టంగానే మారిపోయింది. దీంతో ఈ ముగ్గురిపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన నాని ఇప్పుడు కొత్త వ్యూహాల్ని రచిస్తున్నారు.

కంట్లో నలుసుగా కేశినేని చిన్ని
అసలే సొంత పార్టీలో నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేశినేని నానికి సోదరుడు కేశినేని చిన్ని తనతో విభేదించడం మొదలుపెట్టాక చిక్కులు మరింత పెరిగాయి. ముఖ్యంగా కేశినేని నాని ఎవరిని అయితే వ్యతిరేకిస్తున్నారో వారితోనే కేశినేని చిన్ని రాజకీయాలు చేస్తుండటం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో ఇప్పుడు వారిని ఎదుర్కొనేందుకు కేశినేని పాత రాజకీయాల్ని పక్కనబెట్టి కొత్త తరహా రాజకీయాలు చేయాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం కూడా ఇరుకునపడుతోంది.

టీడీపీలో ప్రత్యర్ధి త్రయానికి చెక్ ?
తాజాగా మారిన పరిస్ధితుల్లో కేశినేని చిన్ని సహకారంతో నాని ప్రత్యర్ధులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ పశ్చిమలో పోటీకి సిద్ధమవుతున్న బుద్ధా వెంకన్న, మైలవరంలో తిరిగి గెలిచేందుకు ప్రయత్నిస్తున్న దేవినేని ఉమ, విజయవాడ సెంట్రల్లో పోటీ పడుతున్న బోండా ఉమకు చెక్ పెట్టేందుకు నాని ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ ముగ్గురిలో ముందుగా మైలవరంపై దృష్టిపెట్టిన నాని.. వైసీపీ ఎమ్మెల్యే వసంత ఫ్యామిలీని టీడీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దేవినేని ఉమకు చుక్కలు కనిపిస్తున్నాయి. అలాగే విజయవాడ పశ్చిమలో బుద్దా వెంకన్నకు చెక్ పెట్టేందుకు జలీల్ ఖాన్ ను ప్రోత్సహిస్తున్న నాని, సెంట్రల్ నియోజకవర్గంలో బోండా స్ధానంలో వంగవీటి రాధాకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

వైసీపీకి చెక్ పెట్టేలా వ్యూహాలు ?
అదే సమయంలో టీడీపీ ప్రత్యర్ధి వైసీపీకీ చెక్ పెట్టేలా కేశినేని నాని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా తాజాగా చోటు చేసుకున్న రెండు పరిణామాలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ప్రత్యర్ధి పార్టీ అని తెలిసీ మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు ఎంపీ నిధుల్ని కేటాయించడం ద్వారా నాని తన ఉద్దేశం చెప్పేశారు. అలాగే విజయవాడ పశ్చిమలో వైసీపీ నేతల్ని తమవైపు తిప్పుకుని టీడీపీ కండువాలు కప్పేశారు. అంతేకాదు మాఫియా నేతలకు కాకుండా మంచివారికి టికెట్ ఇస్తే 25 వేల మెజార్టీతో గెలిపిస్తామని అధిష్టానానికీ సంకేతాలు ఇచ్చేశారు. తద్వారా సొంత పార్టీ టీడీపీని బలోపేతం చేస్తూ అధినేత చంద్రబాబుకు విధేయుడిగానే ఉండాలనేది నాని వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications