బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఉండగా జెఎసిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా ఏర్పాటు విషయమై జెఎసిని ఏర్పాటు చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో జెఎసిని ఏర్పాటు చేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.ఈ మేరకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్సత్తా చీఫ్ జయప్రకాష్ నారాయణతో కూడ చర్చలు జరపనున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే లోక్సత్తా చీఫ్ జయప్రకాష్ నారాయణతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఆదివారం నాడు (ఫిబ్రవరి 11న) చర్చలు జరపనున్నారు. ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై ఒత్తిడి పెంచేందుకు కార్యాచారణపై చర్చించనున్నారు.

బాబు ఉండగా జెఎసి ఎందుకు
ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో నిధులు, హక్కుల విషయంలో రాజీ పడే అవకాశమే లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఏపీ హక్కుల కోసం ప్రత్యేకంగా జెఎసిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేశినేని నాని చెప్పారు.ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో రాజీ లేకుండా పోరాటం చేస్తున్నట్టు నాని చెప్పారు.చంద్రబాబు సీఎంగా ఉండగా జేఏసీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరమేలేదని చెప్పారు.

కేంద్రం మాటలను నమ్మం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తామని ప్రకటించిందన్నారు. అయితే ఆచరణలో నిధులు వస్తేనే తాము నమ్ముతామని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు.మాటలు చెప్పి నిధులు ఇవ్వకుండా ఉంటే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని కేశినేని నాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఇస్తానని ప్రకటించిన నిధులను ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.

నిధులివ్వకపోతే పార్లమెంట్ను స్థంభింపజేస్తాం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులను ఇస్తామని హమీ ఇచ్చింది. ఇచ్చిన హమీలను నిలబెట్టుకోకపోతే మార్చి 5వ, తేది నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను స్థంభింపజేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.ఏపీకి అన్యాయం జరిగిన విషయాన్ని అన్ని జాతీయ పార్టీలు అంగీకరిస్తున్నట్టు నాని గుర్తు చేశారు.

నేడు పవన్ కళ్యాణ్తో ఉండవల్లి భేటీ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ తో జెఎసి ఏర్పాటుతో పాటు ఇతర విషయమై పోరాటం చేసేందుకు జెఎసి ఏర్పాటు విషయమై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆహ్వనం మేరకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (ఫిబ్రవరి 11న, ) ఇవాళ హైద్రాబాద్లో సమావేశం కానున్నారు.ఈ సమావేశం తర్వాత జెఎసి ఏర్పాటుపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications