విజయవాడ స్టేషన్ కు రైల్వే బిగ్ షాక్..! అమరావతి, గన్నవరం కోసం త్యాగం..!
ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి, ఆసియాలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్లలోనూ ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్ కు రైల్వే శాఖ భారీ షాకిచ్చింది. తాజాగా ఈ రైల్వే జంక్షన్ ను ఎయిర్ పోర్ట్ తరహాలో అభివృద్ధి చేసేందుకు రైల్వే తీసుకున్న నిర్ణయంతో నగరవాసులతో పాటు ఈ జంక్షన్ మీదుగా ప్రయాణించే వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తుండగానే తాజా షాక్ ఎదురైంది. దీంతో ఈ చారిత్రక రైల్వే స్టేషన్ కు త్యాగం తప్పేలా లేదు.
విజయవాడ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ స్టేషన్ లో ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటితో పాటు ఈ రైల్వే స్టేషన్ లో ఎప్పటి నుంచో ఉన్న 10 ప్లాట్ ఫామ్స్ కు తోడు మరో రెండు ప్లాట్ ఫామ్స్ కూడా అభివృద్ది చేయాలని అధికారులు నిర్ణయించారు. అది జరిగితే స్టేషన్లలో రద్దీకి చెక్ పడుతుందని ప్రయాణికులు కూడా సంతోషించారు.

కానీ తాజాగా అమరావతి రాజధాని అభివృద్ధి నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు విజయవాడ రైల్వే స్టేషన్ కు ఎదురుదెబ్బగా మారాయి. ముఖ్యంగా అమరావతిలో భారీ రైల్వే టెర్మినల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. విజయవాడ స్టేషన్ ను మించిన స్ధాయిలో అమరావతిలో రైల్వే టెర్మినల్ నిర్మించాలని రైల్వేశాఖను కోరుతోంది. అలాగే గన్నవరంలోనూ మరో భారీ రైల్వే స్టేషన్ ను ప్రతిపాదిస్తోంది. ఈ రెండు స్టేషన్ల కోసం ప్రభుత్వం రైల్వేశాఖపై ఒత్తిడి పెంచుతోంది.

ఇదే ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ కు శాపంగా మారనుంది. ఈ రెండు కొత్త స్టేషన్ల నిర్మాణం నేపథ్యంలో విజయవాడ స్టేషన్లో ముందుగా అనుకున్న విధంగా మరో రెండు ప్లాట్ ఫారాల అభివృద్ధి నిర్ణయాన్ని రైల్వేశాఖ ఉపసంహరించుకుంది. ప్రస్తుతం ఉన్న 10 ప్లాట్ ఫారాల్ని కొనసాగిస్తే సరిపోతుందని నిర్ణయించింది. దీంతో రైల్వే స్టేషన్ విస్తరణ ప్రణాళికలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. వీటికి అయ్యే ఖర్చును రైల్వే శాఖ అమరావతి, గన్నవరం స్టేషన్లపై పెట్టబోతోంది.












Click it and Unblock the Notifications