విజయవాడలో మావోయిస్టుల కలకలం..! హిడ్మా ఎన్ కౌంటర్ వేళ 27 మంది అరెస్ట్ ?
ఏపీలో ఇవాళ మావోయిస్టుల కలకలం రేగింది. ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా పలువురు నేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల మావోయిస్టులు ఏర్పాటు చేసిన డంప్ లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో పలువురు మావోయిస్టు అనుమానితుల్నిపోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవాళ మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో సీనియర్ నేత హిడ్మా సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటన తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టుల డంప్ లు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు పలు చోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ విజయవాడ కొత్త ఆటోనగర్ లో ఉన్న ఓ కొత్త భవనంలో అనుమానితులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు.

కొత్త ఆటోనగర్ లోని భవనంలో 10 రోజుల క్రితం అద్దెకు దిగిన 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్ లో ఉన్న సదరు భవన యజమానికి కూలీలుగా చెప్పుకుని అద్దెకు దిగినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో పోలీసులు వీరితో పాటు భారీ ఎత్తున ఆయుధాల డంప్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పలు అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అదుపులోకి తీసుకున్న వారిని నగరంలోని పటమట పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. రేపు కృష్ణాజిల్లా పోలీసులు లేదా డీజీపీ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications