అమరావతి కంటే విజయవాడనే టాప్: కలల రాజధాని కంటే చంద్రబాబే పాపులర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం బాగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ గూగుల్ సెర్చ్లో రాజకీయ రాజధాని విజయవాడ కోసమే ఎక్కువగా వెతుకుతున్నారు. తాజా గూగుల్ ట్రెండ్స్ ప్రకారం.. ఏపీలో విజయవాడను ఎక్కువ మంది వెతికారు.
2015లో గూగుల్ ట్రెండ్లో విజయవాడ తొలి స్థానంలో ఉండగా, విశాఖ రెండో స్థానంలో, గుంటూరు మూడో స్థానంలో ఉంది. కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన, మై బ్రిక్ మై అమరావతి వంటి వాటి ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రచారం చేసింది.. చేస్తోంది.
అంతేకాదు, భూసమీకరణ తదితర వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ గూగుల్ ట్రెండ్లో విజయవాడ.. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని దాటిపోయింది. ప్రస్తుతం విజయవాడ నుంచే పలువురు మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను సాగిస్తున్నారు.
గూగుల్ ట్రెండ్లో విజయవాడ, విశాఖలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. విజయవాడను సరాసరిన 77 శాతం మంది, విశాఖను 58 శాతం మంది, గుంటూరును 36 శాతం మంది చూశారు.
అమరావతి నాలుగో స్థానంలో ఉంది. అమరావతిని అభివృద్ధి విషయంలో నెటిజన్లు వెతికారు. విజయవాడ, ఇతర నగరాలను ఉద్యోగాలు తదితరాల కోసం వెతికారు. ఇదిలా ఉండగా అమరావతి కంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడినే ఎక్కువగా వెతికారు. అమరావతి చంద్రబాబు కలల రాజధాని.