జగన్ దగ్గరో.. కేసీఆర్ దగ్గరో ఆ ఎంపీని ఇలా చేయమనండి.. ఎలా ఉంటుందో??
సామాజికంగా ఎవరు ఏ స్థానంలో ఉన్నా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు వారికి ఉన్న ఏకైక మార్గం ఏదో ఒక పార్టీని ఆశ్రయించడం. ఆ పార్టీ ద్వారా తాము అనుకున్న పనులుచేసి ప్రజల్లో మంచిపేరు సంపాదించడంతోపాటు పార్టీకి కూడా మంచిపేరు తెచ్చినవారవుతుంటారు. ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా అది వ్యక్తిగతంగాకన్నా పార్టీపరంగా లభించిందే అవుతుంది. పార్టీ లేనప్పుడు పదవి లభించదు.. కీర్తి రాదు. కానీ ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న రాజకీయ నేతలు ఈ విషయాన్ని మరిచిపోతున్నారు. తమవల్లే పార్టీ ఉందని, తమవల్లే పార్టీ బతుకుతోందని భావిస్తుంటారు.

సొంత బలంకాదు.. అది పార్టీ బలం
తెలుగుదేశం కావొచ్చు.. వైసీపీ కావొచ్చు.. బీజేపీ కావొచ్చు.. వ్యక్తులకు గుర్తింపు పార్టీల ద్వారానే సాధ్యమవుతుంటుంది. కానీ పార్టీకి ఉన్న బలంతో పదవులు సంపాదించి తమ సొంత బలంతో ఎదిగామని నేతలు ఎప్పుడైతే అనుకోవడం ప్రారంభిస్తారో.. అప్పటినుంచే వారిని ఆయా పార్టీలు దూరం పెట్టడం ప్రారంభించాలి. లేదంటే వారు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతంటారు. తాజాగా విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తమ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

తాత్సార ధోరణి పనికిరాదంటున్న తమ్ముళ్లు
ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి ఎంపీలంతా విమానాశ్రయానికి వచ్చారు. బొకే ఇవ్వమని జయదేవ్ సూచించగా దానికి నిరాకరించి విసిరికొట్టినంత పనిచేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జరిగిన సంఘటనను చంద్రబాబు మౌనంగా చూస్తుండిపోయారు. ఆయనకున్న సాఫ్ట్ కార్నర్తోపాటు ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నా నేతలపై చర్యలు తీసుకునే విషయంలో తాత్సారం చేయడంలాంటిదే ఇప్పుడు ఇటువంటి నేతలు ఇలా వ్యవహరించడానికి కారణమవుతోందని తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

3మరిన్ని కేశినేనీలు తయారవుతారు
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ముఖ్యమంత్రి జగన్తో ఏ ఎంపీనన్నా ఇలా ప్రవర్తించి చూడమనండి... లేదంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏ ఎంపీనన్నా ఇలా ప్రవర్తించమనండి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలికే సమయంలో ఏ ఎంపీనన్నా ఇలాగే చేయమనండి.. తర్వాత చర్యలు ఎలా ఉంటాయో మీకే అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది. ఒక పార్టీ అధినేతతో వ్యవహరించే విషయంలో ఏ ఎంపీ చేయని సాహసం కేశినేని చేశారంటూ ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు మండిపడుతున్నాయి. మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగింది. అవి అవాస్తవమంటూ ఆయన ఖండించలేదు. పార్టీ అధినేత చూసీ చూడనట్లుగా ఊరుకోవడం అలుసుగా మారిపోతోందని, ఈ తరహా ధోరణిని బాబు మానుకోకపోతే మరికొందరు కేశినేని నానీలు తయారవుతారని, ఇటువంటివారిపై కఠినంగా వ్యవహరించాలని తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటివారిని టీడీపీలో పెట్టుకుని చంద్రబాబు సాధించేది కూడా ఏమీ ఉండదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్ కు కాలమే సమాధానం చెప్పాలి.












Click it and Unblock the Notifications