విజయవాడ మీదుగా సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్..!
ఏపీకి సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు వచ్చే వారికి గుడ్ న్యూస్. ముఖ్యంగా విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వారికి శుభవార్త. ఇకపై విజయవాడ నగరంలో ట్రాఫిక్ తో సంబంధం లేకుండా నగరం దాటిపోయేందుకు వీలుగా ప్రభుత్వం కీలకమైన పశ్చిమ బైపాస్ రోడ్డును అందుబాటులోకి తెచ్చింది.
దీంతో సంక్రాంతికి నగరానికి వచ్చే వారికి ప్రయాణ సమయం మిగలడంతో పాటు వాహనాల్లో చమురు కూడా ఆదా అవుతుంది.

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి నగరంలో ట్రాఫిక్ ఎప్పుడూ నరకం చూపిస్తూనే ఉంటుంది. మారుతున్న అవసరాలకు తగినట్టుగా విజయవాడలో రోడ్లు విస్తరించే అవకాశం లేకపోవడంతో ట్రాఫిక్ రద్దీ అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో నగరానికి ఇరువైపులా రెండు బైపాస్ రోడ్లు నిర్మిస్తున్నారు. ఇందులో పశ్చిమ బైపాస్ నిర్మాణం పూర్తి కాగా.. తూర్పు బైపాస్ నిర్మాణం కొనసాగుతోంది.
హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి వద్ద పశ్చిమ బైపాస్ లోకి ప్రవేశిస్తే గన్నవరం సమీపంలోని చిన అవుటపల్లి వద్ద తిరిగి హైవే ఎక్కేందుకు అవకాశం ఉంటుంది. ఈ మధ్య దూరం 30 కిలోమీటర్లు. అలాగే ఆరు లైన్లుగా నిర్మించిన ఈ బైపాస్ రోడ్డుపై ప్రయాణం కూడా ఎంతో హాయిగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీని అధిగమించడంతో పాటు వేగంగా విజయవాడను దాటి వెళ్లేందుకు వాహనాలకు అనువుగా ఉంది.
వాస్తవానికి 2020లో మొదలైన ఈ బైపాస్ పనులు ప్రస్తుతం 90 శాతం పూర్తయ్యాయి. అయినా సంక్రాంతి రద్దీ దృష్ట్యా రాకపోకలకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా పనులు త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఈ బైపాస్ లో ప్రయాణానికి గంటలోపే సమయం పడుతోంది. ముఖ్యంగా రాజమండ్రి, విశాఖ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారికి నగరంలోకి వచ్చి వెళ్లకుండా ఈ బైపాస్ చాలా కీలకం కానుంది.












Click it and Unblock the Notifications