అమెరికా విమానంలో విశాఖ వాసి అసభ్య చేష్టలు: అరెస్ట్ చేసిన ఎఫ్బీఐ
అమరావతి: అమెరికాలో ఓ తెలుగు వ్యక్తి విమానంలో తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తి అసభ్య చేష్టలపై ఆ దేశానికి చెందిన ఓ జంట చేసిన ఫిర్యాదుతో ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
జంట పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఏపీలోని విశాఖపట్నంకు చెందిన కూనం వీరభద్రరావుగా గుర్తించారు. యూఎస్ అటార్నీ కార్యాలయం(న్యూజెర్సీ) తెలిపిన వివరాల ప్రకారం.. వీరభద్రరావు గత నెల నెల 30న లాస్ ఏంజెల్స్ నుంచి న్యూజెర్సీకి వెళుతున్నారు.
విమానంలో ఆయన పక్కన అమెరికాకు చెందిన ఓ మహిళ తన సహచరుడితో కూర్చున్నారు. ప్రయాణంలో మధ్యలో ఆమె నిద్రపోయింది. నిద్ర నుంచి మేల్కొన్న ఆమె... తన జననావయవాలపై వీరభద్రరావు చేయి ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆయన తన కాలుతో ఆమె కాలును తడుముతున్నాడు.

వెంటనే ఆమె తన సహచరుడికి ఆ విషయం చెప్పగా.. అతడు వీరభద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి వీరభద్రరావు.. 'కావాలంటే డ్రింకు కొనిస్తా, జరిగినదాన్ని మరిచిపోవాల'ని వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ జంట ఆయనపై విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
వెనువెంటనే స్పందించిన విమాన సిబ్బంది వీరభద్రరావు సీటును అక్కడి నుంచి మార్చేశారు. అంతేకాకుండా విమానం నుంచే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానం నెవార్క్కు చేరగానే ఎఫ్బీఐ పోలీసులు వీరభద్రరావుని అరెస్ట్ చేసి, అనంతరం సోమవారం మధ్యాహ్నం నెవార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో 50 వేల డాలర్లు (రూ.33 లక్షలు) సెక్యూరిటీ బాండ్ ను సమర్పించిన ఆయన బెయిల్పై విడుదలయ్యారు. వీరభద్రరావుపై నమోదైన అభియోగాలు రుజువైతే ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.1.66 కోట్ల మేర జరిమానా పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications