విశాఖ:మహిళ సజీవ దహనం కేసులో వీడిన మిస్టరీ,అక్రమ సంబంధమే కారణం
విశాఖపట్టణం: విశాఖనగరంలో ఈనెల 4 వ తేదీన నరవా రోడ్డులో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం సజీవ దహనం స్థితిలో కనిపించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ఒక ఎసిపి ఆధ్వర్యంలో నలుగురు సిఐలు, ఆరుగురు ఎస్ఐలు, 16 మంది పోలీసులు పోలీసులు నిర్విరామంగా పరిశోధించి ఎట్టకేలకు విజయవంతంగా ఈ మర్డర్ మిస్టరీని చేధించారు.
గోపాలపట్నానికి చెందిన ఓ ఫోటో గ్రాఫర్ ఆ మహిళను హత్య చేసి అనంతరం తగలబెట్టినట్లుగా పోలీసులు నిర్దారించారు. మృతురాలు గుంటూరు నగరానికి చెందిన సుజాత అనే వివాహితగా గుర్తించారు. తన పెళ్లికి అడ్డు తగులుతోందన్న కోపంతోనే ఆమె ప్రియుడు సతీష్ ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపర్చారు. పోలీసుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు నగరానికి చెందిన సుజాతకు 2004లో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహంఅయింది. ఈ జంటకు ఇద్దరు మగపిల్లలు సంతానం. అయితే ఆ తర్వాత ఈ దంపతుల మధ్య విభేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత సుజాత ఉద్యోగం వెతుక్కుంటూ విశాఖ నగరం చేరి అక్కడ ఓ హాస్టల్లో ఉంటూ ఎట్టకేలకు ఓ సంస్థలో ఉద్యోగం సంపాదించింది.
ఆమెకు అదే సంస్థలో పనిచేస్తున్న సతీష్ అనే యువకుడు పరిచయం కావడంతో అది ప్రేమగా మారింది. ఆ క్రమంలో వీరిద్దరూ సింహాచలంలో పెళ్లి చేసుకుని కాపురం కూడా పెట్టారు. అయితే ఇటీవల సతీష్కు ఇంట్లోవాళ్లు పెళ్లి సంబంధం కుదిర్చారు. సతీష్ ఆ విషయం ఈమెకు చెప్పకుండా సైలెంట్ గా పెళ్లి కి సిద్దపడ్డాడు. దీంతో వేరేవారి ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుజాత సతీష్ తో తీవ్రంగా గొడవపడింది. నువ్వెలా పెళ్లిచేసుకుంటావో చూస్తానంది.
దీంతో సుజాత ఉండగా తాను పెళ్లి చేసుకోవడం అసాధ్యమని భావించిన సతీష్ ఎలాగైనా ఆమెని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో సుజాతను హత్య చేసి ఆ తరువాత ఆమెని తగులబెట్టాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.