ఇప్పటిదాకా నో బెయిల్...రాజస్థాన్ లో అరెస్టయిన ఆంధ్రా పోలీసుల ఉదంతం
విశాఖపట్టణం:విశాఖలో జరిగిన ఒక దోపిడీ కేసును చేధించేందుకు రాజస్థాన్ వెళ్లి అక్కడ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విశాఖ నగర పోలీసులను దురదృష్టం వెంటాడుతోంది. నిందితులను తప్పించేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో ఎసిబి అరెస్ట్ చేయడంతో కోర్టు తీర్పుననుసరించి జైలుకు వెళ్లారు విశాఖ పోలీసులు. అప్పటినుంచి వారికి బెయిల్ రాకపోవడంతో వారి కోసం రాజస్థాన్ వెళ్లిన ఆ పోలీసు అధికారుల కుటుంబసభ్యులు నెలల తరబడి రాజస్థాన్లోనే పడిగాపులు కాస్తున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన నగల వ్యాపారి మూడు కిలోల బంగారాన్ని తీసుకుని వ్యాపార నిమిత్తం ఈ ఏడాది ఆగస్టు 28న మధురవాడ క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ రాజస్థాన్కు చెందిన రాకేష్కుమార్ ఆ వ్యాపారిని బంధించి దోపిడీ చేసి పరారైపోయాడు. దీంతో ఆ కేసు దర్యాప్తులో భాగంగా నార్త్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ ఆవీఆర్కే చౌదరి, పరవాడ క్రైమ్ ఎస్ఐ ఎస్కే షరీఫ్, మహారాణిపేట క్రైమ్ ఎస్ఐ గోపాలరావు, వన్టౌన్ క్రైమ్ విభాగం కానిస్టేబుల్ హరిప్రసాద్ నవంబర్ నెలలో రాజస్థాన్ వెళ్లారు.

ఎలా జరిగింది?
విశాఖ పోలీసులు అక్కడ కొంతకాలం శోధించి ప్రధాన నిందితుడైన రాకేష్కుమార్ను ఎట్టకేలకు పట్టుకున్నారు. అతనితో పాటు దోపిడీకి పాల్పడిన మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రెండు కిలోల వరకూ బంగారాన్ని రికవరీ కూడా చేశారు. మిగిలిన బంగారం రికవరీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే కొంతమంది నిందితులను కేసు నుంచి తప్పించేందుకు రూ.1.60 లక్షలు లంచం డిమాండ్ చేశారనేది ఆరోపణ. ఆంధ్రా పోలీసులు లంచం అడిగారంటూ నిందితుల్లో ఒకరు అక్కడ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు నవంబర్ 6 వ తేదీన నిందితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా, నలుగురు విశాఖ పోలీసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.

ఇప్పటివరకు నో బెయిల్..
వేరే రాష్ట్రంలో ఎపి పోలీసులు అరెస్టయిన ఘటన సంచలనం సృష్టించింది. మరోవైపు అరెస్టయిన పోలీసులకు బెయిల్ వచ్చేలా సహకరించేందుకు వీలుగా ఎపి పోలీస్ ఉన్నతాధికారులు గాజువాక క్రైమ్ సీఐ కె.పైడపునాయుడిని పంపించారు. అయితే ఏసీబీ కోర్టులో విశాఖ నగర పోలీసులు వేసిన బెయిల్ పిటీషన్ను అక్కడి న్యాయమూర్తి తిరస్కరించడంతో హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై పలుమార్లు వాదనలు జరిగినప్పటికీ ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విశాఖ పోలీసులకు ఇప్పటివరకు బెయిల్ మాత్రం రాలేదు.

ఈనెల 13 న మరోసారి...
ఈ నేపథ్యంలో విశాఖ పోలీసుల బెయిల్ కోసం తాజాగా వేసిన పిటిషన్ హైకోర్టులో ఈనెల 13న విచారణకు రానున్నది. ఈసారైనా బెయిల్ వస్తే బావుండని ఇటు అధికారులు, అటు కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. మరోవైపు తమవారికి బెయిల్ కోసం అక్కడకు వెళ్లిన విశాఖ పోలీసుల కుటుంబ సభ్యులు బెయిల్ నెలలు గడచినా రాకపోవడంతో పరాయి రాష్ట్రంలో పడిగాపులు కాస్తున్నారు.
ఎంత త్వరగా బెయిల్ వస్తుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఏదేమైనా ఈ ఘటనతో ఆంధ్రా పోలీసుల ఉదంతం సర్వత్రా చర్చనీయాంశం అయింది.












Click it and Unblock the Notifications