తలోమాట, హెచ్చరికలు: సీమాంధ్రలో 'రాజధాని' చిచ్చు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో రాజధానిపై ఆయా ప్రాంతాల నేతలు పట్టుబడుతున్నారు. సీమాధ్ర రాజధాని ఏర్పాటుపై నివేదిక ఇచ్చేందుకు ఆరు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు తమ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం జిల్లాలు, ప్రాంతాల నాయకుల్లో రాజధాని కోసం పోటా పోటీ నెలకొంది.
రాయలసీమ ప్రాంత నాయకులు కర్నూలును రాజధానిగా చేయాలని కోరుతుండగా కోస్తాంధ్ర ప్రాంత నాయకులు విశాఖ లేదా విజయవాడను రాజధానిగా ప్రకటించాలని కోరుతున్నారు. సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా చేయకపోతే మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుడతామని కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పగా, రాజధాని కోసం తాను భారీ ఉద్యమాన్ని చేపడతానని టిజి వెంకటేష్లు ప్రకటించారు.
కర్నూలును రాజధానిగా చేయాలన్న విషయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా దృష్టికి తీసుకెళ్లానని కోట్ల తెలిపారు. శనివారం కర్నూలులో టిజి వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ 1953లోనే ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయిందని, అయితే 1956లో రాజధానిని హైదరాబాద్కు తరలించారని, నాటి కర్నూలువాసుల త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు. మళ్లీ త్యాగాలకు కర్నూలువాసులు సిద్ధంగా లేరన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలును రాజధానిగా సాధించుకునేందుకు ఉద్యమం తప్ప తమకు మరో మార్గం లేదన్నారు. సీమాంధ్రలో రాజధాని ఎక్కడనే విషయమై మరో చిచ్చు రాబోతుందని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని ఎక్కడ కావాలనే విషయంపై ఎవరూ ఉద్యమాలు చేయవద్దని విద్యార్థులకు, రాజకీయ పార్టీలకు, ఎన్జీవోలకు సూచించారు.
విజయవాడ - గుంటూరు మధ్య సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించనున్నట్లు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. సీమాంధ్రకు విశాఖపట్నం రాజధాని అయ్యే అవకాశాలున్నాయని మరో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేర్కొన్నారు. సీమాంధ్రకు విశాఖ రాజధాని అయితే చెంతనే ఉన్న ఉభయగోదావరి జిల్లాలూ శరవేగంతో అభివృద్ధి చెందుతాయన్నారు. సీమాంధ్ర రాజధానిగా విజయవాడను ప్రకటించాలని మాజీ మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు.