Visakhapatnam Sabirimala train: ప్రయాణికుల అగచాట్లు..గూడూరులో ఆగిన రైలు,అధికారులెక్కడ..?
సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ఇలా రైల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయన్న భావనతో వారి మిత్రులతో కలసి రైల్లో ప్రయాణిస్తుంటారు. ఇక ఈ ఏడాది చివరిలో పండుగలు ప్రత్యేక రోజులు రావడంతో వారాంతపు సెలవులు బాగానే వచ్చాయి.దీంతో చాలామంది పుణ్యక్షేత్రాలకు, ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు రైలులో రిజర్వేషన్ చేసుకున్నారు. అంతా బాగానే ఉంది.. అన్ని సౌకర్యాలు ఉంటాయని భావించిన వారికి భారతీయ రైల్వేస్ పలు సందర్భాల్లో షాక్ ఇచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది.
కేరళలోని కొల్లాంలో గురువారం రాత్రి 7:30 గంటలకు విశాఖపట్నంకు బయలు దేరిన విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ శమరిమల ఎక్స్ప్రెస్ రైలు (08540)లో కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. దాదాపుగా 12 గంటల నుంచి బోగీల్లో ఏసీ పనిచేయడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రైలు అనుకున్న సమయం కన్నా చాలా ఆలస్యంగా ప్రయాణిస్తుండటంతో ప్యాసింజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఉండటంతో తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే రైలును రేణిగుంట రైల్వే స్టేషన్లో రెండు గంటలపాటు నిలిపివేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రయాణికులు మండిపడ్డారు. రేణిగుంట స్టేషన్ విడిచిన రైలు గూడూరు స్టేషన్కు చేరుకోగానే ప్రయాణికులు ప్లాట్ఫాం మీదకు వచ్చి నిరసన తెలిపారు. దీంతో రైలు గూడూరులోనే నిలిపివేశారు. దీనిపై రైల్వేశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బోగీల్లో నీటి సరఫరా లేకపోవడంతో బోగీల్లో దుర్వాసన వస్తోందని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రయాణించాలని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక రైలు కేరళ నుంచి వస్తుండటంతో అయ్యప్పను దర్శించుకుని వస్తున్నవారితో బోగీలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే రైలు కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తుండటంతో లోపల ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications