వెంకయ్యను మళ్లీ లాగిన వైసీపీ -వీపీ మౌనమేల? పోస్కోతో జగన్కు లింకుల్లేవు: మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్కు మకుటంగా ఉంటోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్లాంట్ కార్మికులు, కూలీలు, సిబ్బందితో ఏర్పడిన పరిరక్షణ సమితికి, దాని ఉద్యమకార్యాచరణకు అన్ని పార్టీలూ మద్దతు పలుకుతున్నాయి. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాబట్టి దీనిపై ఎక్కువ బాధ్యత బీజేపీపై ఉందని అధికార వైసీపీ వాదిస్తోంది. ఈ క్రమంలోనే.. నాటి విశాఖ ఉక్కు ఉద్యమానికి సారథుల్లో ఒరైన, ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు పేరును వైసీపీ పదే పదే ప్రస్తావిస్తోంది..
వెంకయ్య ఏం చేస్తున్నారు?
60, 70వ దశకాల్లో 'విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు' నినాదంతో సాగిన ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పాలుపంచుకున్న వెంకయ్య నాయుడు.. పోరాటంలో భాగంగా జైలుకు వెళ్ళడమేకాదు, పోలీసులతోనూ ఘర్షణ పడ్డారు. నాటి ఉద్యమ నేపథ్యంతో వెంకయ్య అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ భారత ఉపరాష్ట్రపతి స్థాయికి చేరడం తెలిసిందే. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటేజైషన్ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి దాదాపు అందరూ వెంకయ్యను ప్రస్తావిస్తుండగా, వైసీపీ మాత్రం ఓ అడుగు ముందుకేసి, ఉపరాష్ట్రపతి ఏం స్పందిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు భూముల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న పోస్కో కంపెనీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముందునుంచే సంబంధాలున్నాయన్న ఆరోపణలకు కౌంటరిస్తూ ఏపీ మంత్రులు వెంకయ్య పేరును ప్రస్తావిస్తుండటం గమనార్హం. తాజాగా..
మరణాలకు కారణభూతుడు
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయాలన్నది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, ఇందులో ఏపీ సర్కారు పాత్ర ఉండే అవకాశమే లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన కూడా వీపీ వెంకయ్య జోక్యాన్ని కోరుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ''ఆ నాడు విద్యార్థులుగా మేం కూడా 'విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు' ఉద్యమంలో పాల్గొన్నాం. నాడు అందరినీ లీడ్ చేసిన వ్యక్తి వెంకయ్య నాయుడు. ఆనాడు ఉద్యమం చేసి, అనేక మంది చనిపోవడానికి కారకులై, స్టీల్ ప్లాంట్ బాధ్యతను తీసుకున్న వ్యక్తిగా వెంకయ్యను చెప్పుకోవచ్చు. అదే వ్యక్తి ఇవాళ భారతదేశంలోనే రెండో అత్యున్నత పదవిలో, ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. మరి..
కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెంకయ్య నాయుడు ఏం స్పందిస్తారు? ప్రస్తుతం వాళ్లు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి.. విశాఖపై చర్యలు తీసుకునే విధంగా, స్టీల్ ప్లాంటును ప్రైవేటుకు ఇవ్వకూడదనే దిశలో.. ఈ ప్లాంటు త్యాగాల ఫలితంగా ఏర్పాటైందని వివరించి, వారే నిర్ణయించాలి'' అని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవలే రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఉద్దేశించి చేసిన అసాధారణ (మనసు బీజేపీతో, తనువు టీడీపీతో అంటూ) వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, ఆ వెంటనే సాయిరెడ్డి సభాముఖంగా సభాపతికి క్షమాపణలు చెప్పిన దరిమిలా.. శుక్రవారం నాటి ప్రెస్ మీట్ లో వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి.. యధాలాపంగా కేంద్రంలో ఉన్నది వాళ్ల ప్రభుత్వమే అని వెంకయ్యను ఉద్దేశించి అనడం చర్చకు దారితీసింది. ఇక..
అయితే ప్రధానిని కలుస్తారు..
విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత వీపీ వెంకయ్యపైనా ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి, పోస్కో సంస్థతో ఏపీ సీఎంకు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ''పోస్కో అనేది అంతర్జాతీయ సంస్థ. ఏదైనా ఏదైనా స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారంటే, వాళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తారు? అసలా ప్రపోజల్ పెట్టిందే కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అమ్మకాలు, ఒప్పందాలకు సంబంధించిన ఏవైనా పోస్కో వారు ప్రధానమంత్రితోగానీ, సంబంధిత శాఖల మంత్రులనుగానీ కలుస్తారే తప్ప ఈ అంశంలో సీఎంలను కలవాల్సిన అవసరం ఏ రాష్ట్రంలోనూ ఉండదు. అయితే..
పోస్కోతో జగన్కు సంబంధాల్లేవు
అంతర్జాతీయ కంపెనీ పోస్కో వాళ్లు ఏదో కర్టసీగా మాత్రమే ఏపీ సీఎంను కలిశారు. ఆ రోజుకు ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రపోజల్ కూడా లేదు. అలాంటప్పుడు దీన్ని జగన్ కు ఏ విధంగా ముడిపెడతారు? ఇందులో ఏదో కుట్ర జరిగిందని, ముఖ్యమంత్రే విశాఖ స్టీల్ ప్లాంట్ కొనేస్తున్నారని చంద్రబాబు చెప్పడం దురదృష్టకరం. ప్రైవేటైజేషన్ వ్యవహారంతోగానీ, పోస్కో సంస్థతోగానీ మా నాయకుడు జగన్ కు ఎలాంటి సంబంధాల్లేవు. పోస్కో వాళ్లు కేవలం మర్యాదపూర్వకంగానే కలిసివెళ్లారు'' అని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. కాగా, 2019లో పోస్కోకు ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్ ప్లాంట్)కు ఒప్పందం కుదిరిన తర్వాత.. ఆ ప్రతినిధులు ఏపీ సీఎం జగన్ ను కలిశారని కేంద్ర ఉక్కు శాఖ పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొనడం గమనార్హం.
షాకింగ్: జగన్ పుట్టి ముంచిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్పై సంచలనం -19నుంచే సీఎంకు తెలుసన్న ప్రధాన్