ఇటు ఉత్సవం.. అటు పాలిటిక్స్.. ఇది విశాఖలో గంటా పాలిటిక్స్
విశాఖపట్నం/ అమరావతి/ హైదరాబాద్: యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించేందుకు మూడేళ్లుగా నిర్వహిస్తున్న 'విశాఖ ఉత్సవాలు' అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి కుంపటి రాజేశాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు అసలే ఉప్పు - నిప్పుగా వ్యవహరించే రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు - చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఆధిపత్య పోరుకు కేంద్ర బిందువుగా మారాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తిగా ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి.
Recommended Video
మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ ఉత్సవాలు టీడీపీలో విభేదాలను బహిర్గతం చేశాయి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల వైపు అయ్యన్న వర్గం చూడనే లేదని విమర్శ ఉన్నది. అయ్యన్న సహచరులు ఉత్సవాలు బహిష్కరిస్తే.. గంటా మద్దతు దారుల్లోనూ పూర్తి సంత్రుప్తి ఉన్నట్లు కనిపించలేదు. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యేలు మండి పడుతున్నారు.
నిర్వహణ తీరుపై నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ హరిబాబు
గంటాకు మద్దతుదారైన ఎంపీ ఆవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కూడా తొలి రెండు రోజులు ఉత్సవాలకు డుమ్మా కొట్టారు. రెండో రోజు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాత్రమే హాజరవ్వడంతో శనివారం కార్యక్రమాల్లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, టీడీపీ విశాఖ రూరల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, జెడ్పీ చైర్ పర్సన్ లాలం భవానీ పాల్గొన్నారు. ఉత్సవాలు జరిగే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రుష్ణ బాబు, పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు వాసుపల్లి గణేశ్ కుమార్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే పీజేవీఆర్ గణబాబు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, విశాఖ నార్త్ ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజు (బీజేపీ) ముఖం చాటేశారు. ఇక విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాత్రమే చివరి రోజు హాజరయ్యారు. కానీ ఉత్సవాలకు తనకు ఆహ్వానం అందలేదని నిర్వహణ తీరుపై నిప్పులు చెరిగారు.
గంటాతో విభేదాలే లేవన్న అయ్యన్న
సిటీ ఎమ్మెల్యేలే కాదు రూరల్, ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు ఉత్సవాలకు దూరంగా ఉండటం గమనార్హం. అంతా తానై ఉత్సవాలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావుతో తనకు ఎటువంటి విభేదాల్లేవని, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఉండటం వల్లే హాజరు కాలేకపోయానని అయ్యన్న పాత్రుడు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2014 నుంచి మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా రాజకీయాల్లో గంటా ఆధిపత్యం వహించడం అయ్యన్నకు సుతారామూ ఇష్టం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో భూభాగోతంపై విమర్శలతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా రంగ ప్రవేశం చేసి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారని అభిప్రాయం ఉంది.
అధికారుల తీరుపై ఎమ్మెల్యేల మండిపాటు
విశాఖ ఉత్సవాలు జరిగిన ఆర్కేబీచ్ ప్రాంతం తూర్పు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. చివరకు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉత్సవాలకు డుమ్మా కొట్టారు. గంటాపైన, అధికారుల తీరుపైన వెలగపూడి ఒంటికాలిపై లేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైన తనకు కనీసం ప్రొటోకాల్ కూడా పాటించలేదని, ఆహ్వాన పత్రికల్లో మిగిలిన ఎమ్మెల్యేలతో కలిపి పేర్లు వేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అర్బన్ జిల్లా అధ్యక్షుడైన దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్తో సహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా గంటా తీరుపై గుర్రుగా ఉన్నారు. జిల్లా అధికారులు గంటా అడుగులకు మడుగులొత్తుతూ తమను పట్టించుకోవడం లేదంటూ జెడ్పీ చైర్పర్సన్తో సహా ఎమ్మెల్యేలందరూ మండిపడుతున్నారు.
కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తారా?
ప్రస్తుతం విశాఖ ఉత్సవ్కు టూరిజం ఈడీ శ్రీరాములునాయుడు తీరుపై ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గంటా శ్రీనివాసరావును తప్ప ఇతర ప్రజాప్రతినిధులను ఆయన పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా పిలవడం కానీ, కనీసం ఆహ్వాన పత్రాలు స్వయంగా ఇవ్వడం కానీ చేయలేదని ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఉత్సవాల పేరిట లెక్కా పత్రం లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తుండడం ఎంతవరకు సమంజసమని మంత్రి అయ్యన్నే గతంలో విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా మిగిలిన ఎమ్మెల్యేలు సైతం ఇదే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు.
ముక్తసరి వ్యాఖ్యలతో సరిపెట్టిన స్పీకర్ కోడెల
తొలిరోజు ఏకంగా శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ వచ్చినా.. ఒక్క ఎమ్మెల్యే కూడా ఉత్సవాల్లో పాల్గొనలేదు. కనీసం ఆయనకు స్వాగతం పలికేందుకు కానీ, గెస్ట్హౌస్లో పలకరించేందుకు కూడా రాలేదు. స్పీకర్గా బ్రహ్మరథం పడతారని నగరానికి వచ్చిన కోడెలకు ఆశాభంగం ఎదురైంది. గంటా, అమర్నాథ్లతో కలసి కార్నివాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నా.. ముక్తసరిగా నాలుగు ముక్కలు మాట్లాడి కోడెల వెళ్లిపోయారు. రెండోరోజు మంత్రి అయ్యన్న మాటెలాగున్నా నగర ఎమ్మెల్యేలు, ఎంపీలైనా వస్తారని అంతా భావించారు. కానీ ఒక్క గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఉత్సవాల చుట్టుపక్కల కనిపించలేదు. రెండో రోజైన శుక్రవారం కొల్లు రవీంద్ర, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ విశాఖ ఉత్సవ్కు హాజరయ్యారు.
కోలాహలంగా ముగిసిన విశాఖ ఉత్సవాలు
కాకపోతే విశాఖ ఉత్సవ్ మూడు రోజుల సంబరం అంబరాన్నంటింది.నూతన సంవత్సర వేడుకలకు ముందే కొత్త ఆనందాల్ని మోసుకొచ్చింది. ప్రగతిలోనూ, సంస్కృతిలోనూ, తూర్పు తీరాన దీపశిఖలా వెలుగొందుతున్న విశాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన ఉత్సవం విజయవంతమైంది.వినూత్న ప్రదర్శనలతో ఏటేటా కొత్త రూపు సంతరించుకుంటూ సాగుతున్న ఈ సందళ్లు ప్రజల హృదయాలను కూడా దోచుకుంటున్నాయి. విశాఖకు వచ్చిన వారంతా ఇక్కడి ప్రకృతి రమణీయతను స్పృశించి.. తీరపు సొగసును ఆస్వాదించి. సంతోషాల్లో మునిగితేలారు.మహా నగరితో అనుబంధం ఎన్నటికీ తీరిపోనిదంటూ ఆనందంగా వెనుదిరిగారు.