జగన్ తోక కట్ చేయడం మాకు 2 ని.ల పని: బిజెపి హెచ్చరిక, రోజాపై అసహనం
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో బుధవారం నాడు వాడిగా, వేడిగా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు విషయమై తెలుగుదేశం పార్టీ... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసింది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ...
టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... చంద్రబాబు ఆనాడు కమిటీ వేయించి అల్మట్టి ఎత్తును అడ్డుకున్నారని చెప్పారు. జ్యోతుల నెహ్రూ గందరగోళంలో ఉన్నారని చెప్పారు. కృష్ణా నది ఎగువన అనేక ప్రాజెక్టులు వచ్చాయన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు పైన స్పష్టంగా వైసిపి తమ వైఖరి చెప్పాలన్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత భారీగా తగ్గిందని, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైయస్ ప్రారంభించిన జలయజ్ఞం పదేళ్లయినా పూర్తయిందా అని ప్రశ్నించారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతుంటే గుడ్డిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వైసిపిని ప్రశ్నించారు. రాజధాని, పట్టిసీమ.. ఇలా వైసిపి అసలు దేనికి సహకరించిందో చెప్పాలన్నారు. అవినీతిలో మాత్రం ముందుంటారని ఎద్దేవా చేశారు.
దయచేసి బోడిగుండుకు మోకాలికి లింక్ పెట్టవద్దన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కనీసం నాలుగేళ్లు పట్టే అవకాశముందన్నారు. వృథాగా పోతున్న నీటిని కరువు పరిస్థితుల్లో వాడుకుంటే తప్పేమిటన్నారు. లక్షల క్యూసెక్కులు నదిలో కలిసిపోతుందన్నారు. వాటిని వాడకుందామన్నారు.
ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టిసీమ వల్ల 7 లక్షల ఎకరాలు సాగు చేయవచ్చునని చెప్పారు. మీకు ఎక్కడైతే మెజార్టీ వచ్చిందో ఆ జిల్లాలకు ప్రాజెక్టులు వ్యతిరేకిస్తున్నారని గోరంట్ల విమర్శించారు.
మీ తోక కట్ చేయడం రెండు నిమిషాల పని
అంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మాట్లాడుతూ.. బిజెపిని తోక పార్టీ అన్నారు. దీనిపై బిజెపి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సభ్యులు విష్ణుకుమార్ రాజు, ఇతరులు మాట్లాడారు.
తమ పార్టీని వైసిపి తోక పార్టీ అనడం విడ్డూరమన్నారు. తమది జాతీయ పార్టీ అని, అలాంటి పార్టీని తోక పార్టీ అనడం ఏమిటన్నారు. జలవనరులను సద్వినియోగం చేసుకోవడంలో నాడు వాజపేయి, నేడు ప్రధాని మోడీ ముందున్నారన్నారు.
తాము అనంతపురం జిల్లాలో ఓసారి పర్యటించినప్పుడు... తాము వారానికి ఓసారి స్నానం చేస్తున్నామని, తమకు తాగు, సాగునీరు ఇవ్వాలని అక్కడి ప్రజలు తమకు ఓసారి చెప్పారని గుర్తు చేశారు.
తమది జాతీయ పార్టీ అని, అలాంటి పార్టీని తోక పార్టీ అనడం విడ్డూరమన్నారు. బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... తమది తోక పార్టీయే అయితే, మీ తోక కట్ చేయడం మాకు రెండు నిమిషాల పని అని వైసిపిని హెచ్చరించారు. పట్టిసీమను చంద్రన్న పట్టిసీమగా అభివర్ణించారు.
అంతకుముందు, చంద్రబాబు మాట్లాడుతూ... గోదావరి ప్రజలను వైసిపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇదేం పార్టీ ఓ స్టాండ్ లేకుండా అన్నారు. రెండు గోదావరి జిల్లాలు తమను ఆదరించిన సంగతిని మేం ఎప్పుడు మర్చిపోలేదన్నారు.
పట్టిసీమపై వైసిపి సభ్యులు జిల్లాకో మాట చెబుతున్నారన్నారు. తప్పులు చేస్తే సరిచేయాలి కానీ విమర్శలు సరికాదన్నారు. వైసిపి తరఫున ఊరికి ఒక విధంగా మాట్లాడుతున్నారని, పార్టీ అన్నప్పుడు ఒక మాట మాట్లాడాలన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దన్నారు.
రోజా పైన స్పీకర్ ఆగ్రహం
మీరు ఎక్కువగా మాట్లాడవద్దని రోజాకు సభాపతి కోడెల శివప్రసాద్ సూచించారు. ఎప్పుడు మీరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.