అంత మాటన్నారా!: సస్పెన్షన్ కరెక్ట్.. విష్ణు, 'రోజాకు సభకు వచ్చే అర్హత లేదు'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా పైన ఏడాది పాటు సస్పెన్షన్ సరైనదేనని, అసలు జీవిత కాలం పోటీ చేయకుండా చేయాలని పలువురు సభ్యులు ఏపీ శాసన సభలో మంగళవారం అభిప్రాయపడ్డారు. రోజా వ్యాఖ్యలపై సభలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ... రోజా సభలో చేసిన వ్యాఖ్యలు తెలియక తాను తొలుత ఏడాది పాటు సస్పెన్షన్ సరికాదని చెప్పానని, రికార్డులు విన్నాక అది సరైనదేనని భావిస్తున్నానని అన్నారు.
కాబట్టి నాలుగు రోజుల క్రితం రోజా పైన సస్పెన్షన్ తగ్గించాలన్న తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. మొదట తెలియక అలా వ్యాఖ్యానించానన్నారు. రోజా పైన చర్యలు సమంజసమేనని ఇప్పుడు భావిస్తున్నానని చెప్పారు.
రోజాను ఏడాది పాటు కాకుండా పూర్తికాలం సస్పెండ్ చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఆమె అనితతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. రోజా సభ లోపలే కాకుండా వెలువలా నీచంగా మాట్లాడుతున్నారన్నారు.
రోజా భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. రోజాకు సభకు వచ్చే అర్హతనే లేదన్నారు. తోటి మహిళా ఎమ్మెల్యే పైన రోజా వ్యాఖ్యలు సరికాదని కిమిటి మృణాళిని అన్నారు. ఆమె పైన ఏడాది పాటు సస్పెన్షన్ సరైన చర్యే అన్నారు. రోజాను సమర్థించిన ప్రతిపక్ష నేత పైనా చర్యలు తీసుకోవాలన్నారు. జీవితంలో ఆమె పోటీ చేయకుండా చూడాలన్నారు.