జగన్ అడిగిన దానికి సమాధానం చెప్పండి: టిడిపికి బిజెపి విష్ణు షాక్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిజెపి సభ్యులు విష్ణు కుమార్ రెడ్డి.. వైసిపి అధినేత జగన్కు ఓ సందర్భంలో మద్దతుగా నిలిచారు. జగన్ లేవనెత్తిన పాయింటుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు సమాధానం చెప్పాలని సూచించారు.
జగన్ మాట్లాడుతూ... పోలవరం పనులు జరగడం లేదని తెలిసినా కాంట్రాక్టర్కు రేట్లు పెంచుకునేందుకు కేబినెట్ అనుమతివ్వడం ఏమిటన్నారు. కేబినెట్ తీర్మానంపై సంతకం పెట్టేందుకు కూడా సీఎస్ జంకారన్నారు. చంద్రబాబు బినామీ శీనయ్యకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. రూ.23 కోట్ల పనికి రూ.74 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు.
అనంతరం మంత్రి దేవినేని మాట్లాడారు. అనంతరం బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడారు. మంత్రి దేవినేని వ్యాఖ్యల్లో స్పష్టత లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు కచ్చితంగా పూర్తవుతుందన్నారు. జగన్ చెప్పిన దాంట్లో ఓ పాయింటు ఉందన్నారు.
పనులు సరిగా చేయని కాంట్రాక్టరును ఎందుకు పొడిగించారో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఎందుకు పొడిగించిందో తెలియదని చెప్పారు.
అలాగే శీనయ్యకు రూ.23 కోట్లకు బదులు రూ.74 కోట్లు ఎందుకని జగన్ అడుగుతున్నారని, దానిపై మంత్రి సూటిగా సమాధానం చెప్పాలన్నారు. మంత్రి దేవినేని సూటిగా సమాధానం చెప్పడం లేదన్నారు. సూటిగా సమాధానం చెప్పకుంటే ప్రజల్లో అనుమానం కలుగుతుందన్నారు. అనంతరం దేవినేని వివరణ ఇచ్చారు.

జగన్ నీ సాక్షిలో రాసి పెట్టుకో: దేవినేని
జగన్! నీ సాక్షి పత్రికలో రాసి పెట్టుకో.. 2018కల్లా పోలవరం పూర్తి చేస్తామని, రాయలసీమను రతనాల సీమగా చేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. నీలో అహంకారం తగ్గి, అసత్యాలు మాట్లాడాలనుకోవడం సరికాదన్నారు. ప్రతి కంపెనీని తన బినామీగా చెప్పడం విడ్డూరమని, అవి అహంకారపు వ్యాఖ్యలు అన్నారు.
సభలో... దూళిపాళ్ల నరేంద్ర, బొండ ఉమ
అంతకుముందు దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ... అమరావతి పైన జగన్ అక్కసు వెళ్లగక్కారన్నారు. సొంత మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. అబద్దపు ప్రచారంపై న్యాయస్థానంలో తేల్చుకుంటామన్నారు. ప్రతిపక్షంగా వైసిపి పూర్తిగా విపలమైందన్నారు. 2009లో ఎవరో కొన్న భూములను తమకు ఆపాదించారన్నారు.
కాపులపై కక్ష కట్టిన జగన్ లోటస్ పాండ్ నుంచి రిమోట్ ద్వారా కిర్లంపూడిలోని ముద్రగడను ఆపరేట్ చేస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు. తక్షణం జగన్ రిమోట్ను కంట్రోల్ చేయడం ఆపాలన్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్న జగన్, కాపులను రెచ్చగొడుతున్నారన్నారు.
కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టిడిపిదే అన్నారు. వారికి రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన వైయస్ రాజశేఖర రెడ్డి, ఆపై దాని ఊసే ఎత్తలేదన్నారు. కులాలు, ప్రాంతాల మధ్య విభేదాలు తెచ్చి, అభివృద్ధిని అడ్డుకోవాలన్నదే జగన్ ఉద్దేశమన్నారు. కాపులకు రూ. 1000 కోట్లను త్వరలో రానున్న బడ్జెట్ లో కేటాయించనున్నామన్నారు.












Click it and Unblock the Notifications