Dastagiri: జగన్కు దస్తగిరి ఓపెన్ ఛాలెంజ్. సెక్యూరిటీ కోసం సీఎం రిక్వెస్ట్.!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి మంగళవారం మీడియా ముందుకు వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన ఆరోపణలు గుప్పిస్తూ, నిందితులను కాపాడేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన అప్రూవర్ అనుమతిని రద్దు చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి తనకు రూ.20 కోట్లు ఆఫర్ చేశారని, ఆ ప్రలోభానికి లొంగకపోవడంతోనే తనను తీవ్రంగా బెదిరిస్తున్నారని వెల్లడించారు. తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తనకు మరియు తన కుటుంబానికి పూర్తిస్థాయి సెక్యూరిటీ కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆశ్రయించారు.
నిందితులకు రాజకీయ రక్షణ!
వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించి సాక్ష్యాలు తారుమారు చేసిన శక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని దస్తగిరి స్పష్టం చేశారు. వైఎస్ సునీత గత ఏడేళ్లుగా ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతుంటే.. ఆమెకు అండగా నిలవాల్సిన సొంత కుటుంబమే, నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి తదితరులకు రాజకీయ రక్షణ కల్పిస్తోందని తీవ్రంగా విమర్శించారు.

ఈ దారుణ హత్య వెనుక ఉన్న కుట్రలు, అక్రమ ఆర్థిక లావాదేవీల మూలాలు పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్, ఆయన సతీమణి భారతి సీబీఐ, ఈడీ విచారణకు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించిన దస్తగిరి, ఈ కేసులో మనీలాండరింగ్ ఏ విధంగా జరిగిందనే వివరాలను ఇటీవల ఈడీ విచారణలో తాను స్పష్టంగా వివరించినట్లు వెల్లడించారు.
సిద్ధార్థ లూథ్రాపై జగన్ ప్రచారం అసత్యం: సవాల్ విసిరిన దస్తగిరి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తనకు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాయే లాయర్ అంటూ వైఎస్ జగన్ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని దస్తగిరి తేల్చిచెప్పారు. సిద్ధార్థ లూథ్రా తన తరఫున ఎప్పుడూ, ఏ కోర్టులోనూ వకల్తా పుచ్చుకోలేదన్నారు. ఒకవేళ ఆయన తన తరఫు న్యాయవాదని జగన్ నిరూపిస్తే తాను జైలుకెళ్లేందుకైనా సిద్ధమని, నిరూపించలేకపోతే జగన్ రాజకీయ సన్యాసం చేస్తారా అని నేరుగా సవాల్ విసిరారు.
అప్రూవర్గా తన విశ్వసనీయతను దెబ్బతీసి కేసును నీరుగార్చడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన న్యాయవాదులపై తప్పుడు కథనాలు సృష్టించి ప్రాణాపాయం కలిగిస్తున్న జగన్పై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులను సస్పెండ్ చేయాలి.. కేటగిరీ-A భద్రత కల్పించాలి!
వైసీపీ హయాంలో తనపై అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్ తెరిచారని, చైతన్యరెడ్డితో పాటు పలువురు పోలీసులు, జైలు అధికారులు తనను భయభ్రాంతులకు గురిచేశారని దస్తగిరి పేర్కొన్నారు. ఇప్పటికీ విధుల్లో ఉన్న జైలు అధికారి ప్రకాశ్, డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యలను వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని కోరారు.
2025లో ఇచ్చిన జీవో 137 ప్రకారం తాను 'కేటగిరీ-A' కిందకు వచ్చే అత్యంత కీలక సాక్షినని గుర్తుచేశారు. తన కుటుంబ రక్షణకు అయ్యే నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని, ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ప్రమాదం లేని సురక్షిత ప్రాంతానికి తమను మార్చి పూర్తిస్థాయి పోలీసు భద్రతతో పాటు ఎస్కార్ట్ కల్పించాలని సీఎం చంద్రబాబును అభ్యర్థించారు.














Click it and Unblock the Notifications
