వివేకా హత్య కేసు..ఆ రోజు ఏం జరిగింది - పెద్దల పాత్ర : వైసీపీ ఎంపీ ప్రస్తావన - పార్టీలో కలకలం..!!
ఏపీలో ఇప్పుడు వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం రాజకీయ ప్రకంపనాలకు కారణమవుతోంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో పెద్దల పాత్ర ఉందంటూ నిందితులు చెప్పారంటూ డ్రైవర్ కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు వైసీపీలో కలకలం రేపుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి మద్దతు తమకు ఉన్నదని సహ నిందితులు చెప్పినట్లుగా దస్తగిరి తన వాంగ్మూలం లో పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిన ఈ హత్యలో రూ.40కోట్ల మేరకు సుపారీ చేతులు మారినట్లు, పథకం ప్రకారం అంతమొందించినట్లు బయట పడింది.

వివేకా హత్య కేసులో కీలకంగా దస్తగిరి వాంగ్మూలం
2019 మార్చి 15వ తేదీ పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో ఇప్పటివరకు నలుగురి పాత్రను సీబీఐ అధికారులు వెలికితీశారు. ఈ నిందితుల్లో దస్తగిరి ఒకడు. గతంలో అతడు వివేకాకు కారు డ్రైవర్గా పనిచేశాడు. వివేకా పొలం పనులు చూసే గజ్జల ఉమాశంకర్ రెడ్డి, ఉమా స్నేహితుడు సునీల్ యాదవ్, వివేకా మాజీ అనుచరుడు యర్ర గంగరెడ్డి ఈ కేసులో మిగతా నిందితులు. వీరందరిపై ఇటీవల సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా 161 సీఆర్పీసీ కింద దస్తగిరి వాంగ్మూలాన్ని ప్రొద్దుటూరు కోర్టులో ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన సీబీఐ అధికారులు నమోదు చేయించారు.

గొడ్డలితో నరికి అంతం చేసారు
గజ్జల ఉమాశంకర్రెడ్డి, యర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్తో కలిసి తాను గొడ్డలితో నరికి వివేకాను అంతమొందించినట్టు దస్తగిరి ఈ వాంగ్మూలంలో అంగీకరించాడు. వివేకా హత్యకు నిందితుడు దస్తగిరి వెనుకాడగా.. ''నువ్వు ఒక్కడివే కాదు.. మేము కూడా వస్తాము.. మరియు దీనివెనుక పెద్దవాళ్లు ఉన్నారు'' అని యర్ర గంగిరెడ్డి అన్నట్టు నిందితుడు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. 'ఎవరా పెద్దవాళ్లు' అని తాను అడగ్గా.. 'వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి, డి. శంకరరెడ్డి ఉన్నారు' అని గంగిరెడ్డి చెప్పినట్టు దస్తగిరి..మేజిస్ట్రేట్ ఎదుట వెల్లడించాడు. హత్య సమయంలో ఏం జరిగిందో వివరంగా దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పాడు.

భయం లేదు..వారితో మాట్లాడానని చెప్పారంటూ..
''వివేకా హత్య జరిగిన రోజు వేకువ జామున 5.25గంటలకు సునీల్ యాదవ్ నాకు ఫోన్ చేసి.. గంగిరెడ్డి ఇంటికి రమ్మన్నాడు. నేను, సునీల్, ఉమాశంకర్ రెడ్డి అక్కడకు వెళ్లగా... ఏమీ భయ పడొద్దని నాకు ధైర్యం చెప్పారు. 'డి. శంకర్ రెడ్డి, వై.ఎస్. అవినాష్రెడ్డితో నేను మాట్లాడాను.. వాళ్లు చూసుకుంటారు' అని గంగిరెడ్డి చెప్పాడు. మిగతా డబ్బు కూడా ఇచ్చేస్తానని చెప్పాడు. తర్వాత మమ్మల్ని పోలీసులు విచారణ నిమిత్తం పిలిచారు. అక్కడ గంగిరెడ్డి.....'భయపడవద్దు.. హత్య జరిగిన ప్రదేశాన్ని తుడిపించాను. ఎటువంటి ఆధారాలు లేకుండా చేశాను. మిగతా డబ్బులు త్వరలో ఇచ్చేస్తాను' అని చెప్పాడు'' అని కోర్టుకు దస్తగిరి వివరించాడు.

ఎమ్మెల్సీగా ఓడిపోవటంపై గుర్రుగా వివేకా
తాను ఎమ్మెల్సీగా ఓడిపోవటం పైన వివేకా ఆగ్రహంతో కనిపించారని చెప్పాడు. యర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమా శంకర్ రెడ్డిని ఆఫీసుకు పిలిపించి బాగా తిట్టారని.. అవినాష్, భాస్కర్ రెడ్డి సంగతి తేలుస్తానని చెప్పుకొచ్చాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన షేక్ దస్తగిరి వాంగ్మూలం సేకరించారు... వివేకా హత్యకు భూవివాదమే కారణమని దస్తగిరి వెల్లడించాడు.
ల్యాండ్ సెటిల్మెంట్ తరువాత రూ.8కోట్లు వివేకానందరెడ్డికి ఇవ్వాల్సి ఉందని నాకు తెలిసింది. ఈ సెటిల్మెంట్ వ్యవహారంలో ఎర్రగంగిరెడ్డి చురుకైన పాత్ర పోషించారు. ఒంటరిగా బెంగుళూరు వెళ్తుండేవారని వివరించాడు. హత్య సమయంలో వివేకాను సునీల్ యాదవ్ బూతులు తిడుతూ ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశాడు.

హత్య సమయంలో బలవంతంగా ఉత్తరం రాయించి
వివేకా అప్పుడు వెనక్కి పడిపోవడంతో గజ్జల ఉమా శంకర్ రెడ్డి నన్ను గొడ్డలి అడిగి తీసుకుని తలపై గాయపరచగా.. వివేకా పక్కకు తిరిగారు. వెంటనే మళ్లీ వేటు వేయడంతో తల నుంచి రక్తం వచ్చింది. వెంటనే సునీల్ యాదవ్ వివేకా ఛాతీపై ఏడెనిమిది సార్లు కొట్టాడు. వివేకాను మేమందరం కొట్టి.. 'డ్రైవర్ ప్రసాద్ చంపబోయాడు. అతన్ని వదల వద్దు' అని బలవంతంగా ఉత్తరం రాయించి సంతకం కూడా చేయించాం. ఆ తర్వాత వివేకాను బాత్రూమ్లోకి తీసుకెళ్లి చంపుదామని గంగిరెడ్డి చెప్పగా.. మేం ముగ్గురం ఆయనను బాత్ రూమ్లోకి తీసుకెళ్లి కింద పడేశాం.

వైసీపీలో కలకలంగా మారిన దస్తగిరి వాంగ్మూలం
అప్పుడు ఉమా శంకర్ రెడ్డి గొడ్డలి తీసుకుని ఐదారు సార్లు తలపై నరకడంతో వివేకా చనిపోయారు. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయాం'' అని సీబీఐకి దస్తగిరి తెలిపాడు. ఇక, ఇప్పుడు ఈ వాంగ్మూలంలో కడప ఎంపీ అవినాశ్ పేరు ప్రస్తావనకు రావటం వైసీపీకి కొత్త సమస్యగా మారింది.
ఇప్పటికే వివేకా హత్య పైన ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని టీడీపీ..జనసేన తీవ్ర ఆరోపణలు చేస్తునే ఉన్నాయి. ఇక, ఈ విషయం బయటకు రాగానే లోకేశ్ ట్వీట్ చేసారు. ఇప్పుడు ఈ అంశం వైసీపీలో రాజకీయ కలకలంగా మారుతోంది. ఇక, దీని పైన అవినాశ్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications