ఒంటరి మహిళలే లక్ష్యం: ఉద్యోగి అరెస్ట్ (ఫోటోలు)
విశాఖపట్నం: చెడు వ్యసనాలకు బానిసై ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం పక్కన బెట్టి ఒంటరిగా ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారితో పరిచయం చేసుకుని అనంతరం బంగారు ఆభరణాలను దోచుకుని పారిపోయే ఘరానా మోసగాడిని సిసిఎస్, నాలుగో పట్టణ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.
అతని వద్ద నుంచి 173.26 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని మంగళవారం పోలీసు కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో హాజరు పరిచి, కేసు వివరాలను క్రైం ఎడిసిపి వరదరాజులు తెలిపారు.
నగరంలోని విశాలాక్షినగర్లోని రెవెన్యూకాలనీకి చెందిన జంపాన పుల్లంరాజు(50), భార్య, కుమార్తెతో నివాసముంటున్నారు. స్టీల్ప్లాంట్లో సీనియర్ టెక్నీషియన్గా ఉద్యోగం చేస్తున్న పుల్లంరాజు జీతం చాలక దొంగతనాలు, చెడు వ్యసనాలకు బానిసై నేరాలు చేయడం ప్రారంభించాడు.
గత ఏడాది అక్కయ్యపాలెంలో నివాసముంటున్న లక్ష్మీ, డేటాఫ్ బర్త్ సర్టిపికేట్ కోసం జివిఎమ్సి కార్యాలయానికి వచ్చినప్పుడు ఆమెను పుల్లంరాజు పరిచయం చేసుకున్నాడు. సర్టిఫికేట్ త్వరగా చేయిస్తానని నమ్మించి ఆమె ఇంటికి వెళ్తూ కుటుంబ సభ్యులతో చనువుగా మెలగడం ప్రారంభించాడు. గత ఏడాది డిసెంబర్ నెలలో ఆమె ఇంటికి వెళ్లిన పుల్లంరాజు, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండడంతో పాటు బీరువా తెరిచి ఉండడం గమనించాడు. అదే సమయంలో ఆమె బాత్రూమ్కు వెళ్లగా, వెంటనే బీరువాలో ఉన్న సుమారు 14తులాల బంగారు ఆభరణాలను తీసుకుని అక్కడ నుండి ఉడాయించాడు.
బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన ఆమె, పుల్లంరాజు కనిపించకపోవడంతో పాటు బీరువాలోని బంగారం లేకపోవడంతో వెంటనే స్థానిక క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం మద్దిలపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా పుల్లంరాజు సంచరిస్తున్నట్టు సమాచారం అందుకున్న సిసిఎస్, నాలుగో పట్టణ పోలీసులు వెంటనే దాడి చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.
చోరీ సొత్తును దఫదఫాలుగా హెచ్బి కాలనీలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టినట్టు గుర్తించిన పోలీసులు, అక్కడ నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నిందితుడు పాత నేరస్తుడేనని, ఒంటరిగా ఉన్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతూ ఉంటాడని క్రైం ఎడిసిపి తెలిపారు. ఇతనిపై విజయనగరంలోని వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఒకటి, అన్నవరం పిఎస్లో మరోకటి, ఇక్కడి టూటౌన్లో ఇంకోటి కేసులున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐలు దాసరిలక్ష్మణరావు, సిఐ జి.రఘుశ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.