సీఎం చంద్రబాబుకు వాలంటీర్ల భారీ షాక్?
ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్నో హామిలిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసే దిశగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల హామీల్లో ప్రధానమైన అంశం.. వాలంటీర్లకు వేతనం పెంపు. ప్రస్తుతం ఇస్తున్న రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదు. ఇప్పటివరకు వారికిస్తున్న గౌరవ వేతనం రూ.5వేలు కూడా ఇవ్వలేదు. ప్రతినెలా పింఛన్లను వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికీ అందజేస్తున్నారు.
ప్రభుత్వంతో తాడో పేడో
దీంతో ఇప్పటివరకు ఓపిక పట్టిన వాలంటీర్లు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా? అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో తమకు వేతనం పెంచి ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో వాలంటీర్ల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు.

వేతన బకాయిలు కూడా చెల్లించాలని
విజయవాడలో ఈనెల 31వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన వేతనం రూ.10వేలతోపాటు పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి విధివిధానాలు రూపొందించి దానిప్రకారం ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లను విజయవాడకు ఆహ్వానించి భారీ ర్యాలీ చేయాలనే యోచనలో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ నాయకులు దీనిపై చర్చల్లో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు రూ.5వేల గౌరవ వేతనం అందేది. వైసీపీ కోసం కొందరు వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజీనామాలు చేశారు. వారిని మినహాయించి మిగతావారిని తీసుకోవాలనే యోచనలో ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఉంది.












Click it and Unblock the Notifications