వోల్వో బస్సు బోల్తా: ఏపీలో తెరాస సభ్యులకు గాయాలు
హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో... తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రయాణిస్తున్న వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారి పైన మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెరాస ఎంపీటీసీ సభ్యుల బృందం బెంగళూరు విహార యాత్రకు వెళ్తున్న సందర్భంగా బస్సు అదుపు తప్పి బోల్తాపడి ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సభ్యులు నల్గొండ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.