ఒంటిమిట్ట మరో తిరుమల: జగన్, ఎమ్మెల్యే కంటతడి..
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారంనాడు ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి, పలువురు శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని జగన్ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఒంటిమిట్టలో శ్రీరామనవమి వేడుకలు జరపడం శుభపరిణామమని ఆయన ప్రశంసించారు. రాబోయే రోజుల్లో ఒంటిమిట్ట కూడా తిరుమల స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, రాజంపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్డున రెడ్డి శుక్రవారంనాడు అధికారుల తీరుపై మండిపడ్డారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరాముడి కళ్యాణోత్సవంలో తనను అధికారులు అవమానించారని ఆయన మండిపడ్డారు. కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తన కుటుంబ సభ్యులకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఇక నుంచి తాను ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని అంటూ ఆయన కంటతడి పెట్టారు. ఇక నుంచి తాను శాసనసభ్యుడిని కాని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లేనని ఆయన అన్నారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని ఆయన ఆగ్రహించారు. ప్రభుత్వ వాహనంతో పాటు గన్మెన్ను వెనక్కి పంపుతున్నట్లు తెలిపారు. అధికారుల తీరుపై మనస్తాపానికి గురైన మేడా మల్లికార్జున రెడ్డి ఒంటిమిట్ట రథోత్సవానికి గైర్హాజయ్యారు. విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications