మహిళా వీఆర్ఏకు తహశీల్దారు వేధింపులు.. తండ్రి వయసులో ఉండి..
మహిళా భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల మైండ్సెట్స్ మాత్రం మారడం లేదు. సామాన్య మహిళలే కాదు.. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి కూడా ఈ వేధింపులు తప్పడం లేదు.
తాజాగా ఓ మెజిస్ట్రేట్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ మహిళా వీఆర్ఏ పోలీసులను ఆశ్రయించింది. వయసులో తండ్రి లాంటివాడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించింది. పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలేనికి చెందిన వీఆర్ఏ ఇటీవల క్రిస్మస్ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బందికి తన ఇంట్లో విందు ఇచ్చింది. అయితే ఆ విందుకు మెజిస్ట్రేట్ హాజరవలేదు. ఆ మరుసటి రోజు నుంచి తన విందు ఎప్పుడంటూ ఆమెను ప్రశ్నిస్తున్నాడు.

అసభ్య ప్రవర్తన.. లైంగిక వేధింపులు..
వయసులో పెద్దవాడు కావడం.. అందులో మెజిస్ట్రేట్ కావడంతో.. అతను ద్వంద్వార్థంతో మాట్లాడుతున్నాడని ఆమె ఊహించలేకపోయింది. ఇదే క్రమంలో శనివారం మరోసారి ఆమె వద్ద విందు గురించి ప్రస్తావించాడు. తనకు కోడి కూరతో పాటు నువ్వు కావాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. అలా మాట్లాడటం సరికాదని చెప్పినా.. వెనుక నుంచి తనను కౌగిలించుకుని వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు.

పోలీసులకు ఫిర్యాదు
తహశీల్దార్ను వేధింపులపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. తహశీల్దార్ను దర్శి డీఎస్పీ ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో విచారిస్తున్నట్టు చెప్పారు.

ఆరోపణలు కొట్టిపారేసిన తహశీల్దారు..
మరోవైపు వీఆర్ఏ చేసిన ఆరోపణలను తహశీల్దార్ కొట్టిపారేశారు. తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారం అన్నారు. ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టాలన్నారు. తన పేరును చెడగొట్టేందుకే సదరు వీఆర్ఏ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా,విచారణ పూర్తయితే గానీ ఇందులో అసలు నిజం ఏంటన్నది తేలేలా లేదు.












Click it and Unblock the Notifications