జగన్ పాలనలో ఘోర వైఫల్యం: చంద్రబాబుకు సానుభూతి రాదు : ఉండవల్లి సంచలనం..!!
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీఎం జగన్ ప్రమేయం ఉందంటే తాను నమ్మనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఎన్టీఆర్ కుమారైను అసెంబ్లీలో దూషించారన్నా తాను నమ్మనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని..ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం చట్టం సవరిస్తూ..ఇప్పటి వరకు ఉన్న 90 శాతం రుణ పరమితిని 180 కి శాతం పెంచుకోవటాన్ని ఆయన తప్పు బట్టారు. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు.
అప్పులు చేస్తున్నా..తీర్చే మార్గం ఏది
పధకాలు అమలు కోసం అప్పులు చేయటానికి ఏ చిన్న అవకాశం వదులుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అప్పు చేసినా..తీర్చే మార్గం ఏంటని నిలదీసారు. జగన్ తన వ్యాపారం ఇలానే చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అనేక రకాలుగా పన్నులు పెంచేసారని..కేంద్రం నుంచి మాత్రం నిధులు రాబట్టటంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. పోలవరం సవరించిన అంచనాల ప్రకారం ఇవ్వమని కేంద్రం చెబుతున్నా..రాష్ట్రం ప్రశ్నించలేని స్థితిలో ఉందంటూ ఫైర్ అయ్యారు.
జగన్ మూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు
గతంలోనే రుణాలు తెచుకొనేందుకు కేంద్రం విధించిన షరుతలు అన్నీ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని ఉండవల్లి వివరించారు. ఏపీ ప్రస్తుతం 6 లక్షల 22 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చెప్పారు. చంద్రబాబు హయాంలో రెండు లక్షల పది వేల కోట్ల అప్పులు చేస్తే..జగన్ ఈ రెండున్నారేళ్ల పాలనలో మూడు లక్షల ఎనిమిది వేల కోట్లు అప్పు చేసారని లెక్కలు చెప్పారు. జగన్ ఎన్నికల్లో గెలిచిన రోజున తన పాలన ఎలా ఉంటుందో ఆరు నెలల సమయంలోనే చూస్తారని.. అవినీతికి తావు లేని పాలన అందిస్తానని చెబితే అందరం నమ్మామని చెప్పుకొచ్చారు.
కొత్త ఆస్తులు ఏవీ ఇప్పటి వరకు సమకూర్చలేదు
అన్నింటినీ తాకట్టు పెడుతున్నారని..ఎక్కడా ఆస్తులు మాత్రం పెరగటం లేదన్నారు. అసెంబ్లీలో కొత్త సంప్రదాయాలపై మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష టిడిపి సక్రమంగా వ్యవహారించడంలేదన్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సానుభూతి అయిదే రాదని ఉండవల్లి స్పష్టం చేసారు. టిడిపి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడం మానుకోవడం రాష్ట్రానికి ఆరోగ్యకరం కాదని చెప్పారు.
చంద్రబాబుకు సానుభూతి రాదు
రాష్ట్రం అభివృద్ది కోసం జగన్ మాట తప్పిన, మడం తిప్పిన నష్టం ఏమీ లేదంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపీ ప్రభుత్వం ఆమోదించిన ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు చట్ట సవరణ తెలంగాణలోనూ చేసారని..అయితే, ప్రతిపక్షాలు అల్లరి చేస్తాయని ఇప్పటి వరకు కేసీఆర్ ఆ సవరణను వినియెగించుకోవటం లేదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఇలా అప్పులు చేసుకుంటే పోతుంటే... రాష్ట్రంలో చివరకు మిగిలేది ఏంటని ప్రశ్నించారు.