వద్దనుకొంటే బిజెపితో తెగతెంపులు, ఆ రిజల్ట్స్ తర్వాతే బాబు నిర్ణయం: ఉండవల్లి సంచలనం
రాజమండ్రి: గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ పరిస్థితులను చూస్తే 2019 ఎన్నికల్లో టిడిపి బిజెపి కలిసే పోటీ చేసే అవకాశాలున్నాయని రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు.అయితే వచ్చే ఏడాది జరిగే రాజకీయ పరిణామాలను బట్టి 2019 ఎన్నికల్లో పొత్తుల విషయం ఆధారపడే అవకాశం కూడ లేకపోలేదని ఆయన చెప్పారు.
ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై 2019 ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యవహరించే అవకాశం ఉందనే విషయమై ఉండవల్లి అరుణ్కుమార్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఓ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి అరుణ్కుమార్ పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపికి గెలుపు ఛాన్స్ లేదన్నారు.
2019లో టిడిపి, బిజెపి కలిసే పోటీ
2019 ఎన్నికల్లో టిడిపి, బిజెపిలు కలిసే పోటీ చేసే అవకాశాలున్నాయని ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తర్వాత ఈ రెండు పార్టీలు కూడ ఏపీ రాష్ట్రంలో కలిసే పోటీచేసే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.అయితే తమ అవసరాలను ఆసరాగా చేసుకొని బిజెపి నిర్ణయం తీసుకొనే అవకాశం కూడ లేకపోలేదన్నారు.
కెసిఆర్ తెలివైనవాడు, బాబును పిలవకపోవడానికి రాజకీయ కారణం ఉండొచ్చు: ఉండవల్లి
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే మరోలా
2019లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు మారే అవకాశం లేకపోలేదని ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు.పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగితే బిజెపి, టిడిపిలు కలిసే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పారు.పార్లమెంట్, అసెంబ్లీకి వేర్వేరుగా ఎన్నికలు జరిగితే రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా, ఉండదా అనే విషయాలను ఇప్పుడే చెప్పలేమని ఉండవల్లి అన్నారు.
2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా
2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆరు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని ఏర్పాటు చేసే పార్టీలను బట్టి ప్రజల సంకేతాలు కొంత స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. తమకు అవసరం లేదని భావిస్తే బిజెపిని చంద్రబాబునాయుడు దూరం పెట్టే అవకాశం కూడ లేకపోలేదని ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటక మినహ బిజెపి ఛాన్స్ లేదు
దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రం మినహ బిజెపికి అంతగా ఛాన్స్ లేదని ఉండవల్లి అరుణ్కుమార్ అభిప్రాయపడ్డారు. తమిళనాడులో బిజెపి ఊసే ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఏపీ, తెలంగాణలో కూడ బిజెపికి అవకాశాలు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.