ఏపీలో మరో ప్రత్యేకత: దేశంలోనే తొలి గూగుల్ కోడ్ ల్యాబ్ ఏర్పాటు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే తొలి గూగుల్ కోడ్ ల్యాబ్ ఏర్పాటుకానుంది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజినీరింగ్ కళాశాలలో గూగుల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన నమూనాల కసరత్తు తుదిదశకు చేరుకుంది. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభంకానున్నాయి.
ఇప్పటికే గూగుల్తో కలిసి నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న శిక్షణల అమలు బాగుండడంతో ఈ కోడ్ల్యాబ్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు వచ్చింది. ఇంజినీరింగ్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గూగుల్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి సంస్థ గూగుల్ అండ్రాయిడ్ శిక్షణ ఇస్తోంది.
'యంగ్ టెక్నోక్రాట్స్'ను తయారు చేసే ఉద్దేశంతో ఇటీవల 5నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఇలా గూగుల్ సంస్థతో నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న శిక్షణల పరిశీలన అనంతరం ఈ కోడ్ ల్యాబ్ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది.
ఇది పూర్తయితే ఇంజినీరింగ్లో అండ్రాయిడ్ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేవారికి యాప్ల తయారీపై ఏకథాన్, కోడ్ కాన్టెస్ట్లను నిర్వహిస్తారు. విద్యార్థులు అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ల పనితీరును పరిశీలిస్తారు. అవసరమైన విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.
పాఠశాల స్థాయిలో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు ఐదు నుంచి పదో తరగతి వరకు నాలుగు విడతలుగా గతంలో శిక్షణ ఇచ్చారు. గూగుల్ ఇండియా కోడ్ టు లెర్న్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జులై 26నుంచి సెప్టెంబరు ఐదో తేదీ వరకు నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించింది. ప్రైవేటు, ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 1,24,768మందికి శిక్షణ ఇచ్చారు. దేశంలో మూడేళ్లలో రెండు మిలియన్ల మొబైల్ డెవలపర్స్ను తయారు చేయనున్నట్లు గూగుల్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాగా, ఇందులో 25శాతం ఏపీ నుంచే ఉండాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తోంది.
రాష్ట్రంలోని 82 ఇంజినీరింగ్ కళాశాలల్లో 17,425మంది విద్యార్థులు గూగుల్ అండ్రాయిడ్ శిక్షణ పూర్తి చేయగా.. ప్రస్తుతం మరో 2,498మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఇంజినీరింగ్ మూడో ఏడాదిలోనే ఈ శిక్షణ ఇస్తున్నారు.
ఈ ఏడాది 10వేల మందికి విద్యార్థులకు గూగుల్ సర్టిఫికేషన్ ఇప్పించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ ధ్రువీకరణ పత్రం లభించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఒక్కో విద్యార్థికి సుమారు రూ.6,500వరకు వ్యయం కానుంది. దీంట్లో 50శాతం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా చెల్లించనున్నారు.