ఏడాదిన్నర ఆగండి.. ఆ లక్షా 42 వేల ఉద్యోగాలు నేనిస్తా: పాదయాత్రలో జగన్ భరోసా
'జాబు రావాలంటే బాబు రావాలి' అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ జాబు మాటే మర్చిపోయారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.
కడప: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రెండో రోజు కడప జిల్లాలో సాగుతోంది. మంగళవారం వేంపల్లి లోని శ్రీనివాస కల్యాణ మండపంలో జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.
Recommended Video
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'జాబు రావాలంటే బాబు రావాలి' అని చెప్పుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ జాబు మాటే మర్చిపోయారని విమర్శించారు.
ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పిన చంద్రబాబు, లక్షా నలభై రెండు వేల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారని, అయితే వాటి ఊసే ఇప్పుడు ఎత్తడం లేదని జగన్ దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ యువత ఒక ఏడాదిన్నర ఓపికపట్టాలని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్షా 42 వేల ఉద్యోగాలు తాను ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే తమ ప్రభుత్వం వచ్చాక పింఛన్ రూ.2 వేల రూపాయలు చేస్తానని కూడా జగన్ హామీఇచ్చారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ఈ ప్రజా సంకల్ప యాత్ర సుమారు ఆరు నెలల పాటు ఏపీలో 125 నియోజకవర్గాల మీదుగా సాగనుంది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. సుమారు 3 వేల కిలోమీటర్లు జగన్ నడవనున్నారు.