ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు: నా దారిలోకే: విజయసాయి రెడ్డిపై రఘురామ ఫైర్
అమరావతి: రఘురామ కృష్ణంరాజు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా పేరు తెచ్చుకున్న లోక్సభ సభ్యుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తి. వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి కొరుకుడు పడని నేతగా గుర్తింపు పొందారు. ప్రభుత్వం తీసుకుంటోన్న విధానపరమైన నిర్ణయాలు, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులన్నింటిపైనా విమర్శలు గుప్పిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.

పేరుకే అధికార పార్టీ ఎంపీ..
అధికారం పార్టీకి చెందిన ఏంపీ అయినప్పటికీ- ప్రతిపక్ష తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా వ్యవహరిస్తుంటారని చెబుతుంటారు. దీన్ని బలపరిచే సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక వర్గానికి చెందిన మీడియా, ప్రతికాధిపతులకు రఘురామ కృష్ణంరాజు చాలా ఇష్టుడనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు. జైలులో గడిపిన సమయంలో రఘురామ కృష్ణంరాజుకు మద్దతుగా టీడీపీ నేతలు ఆందోళనలు చేశారు.

సాయిరెడ్డిపై ఘాటు విమర్శలు..
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి, రఘురామ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అది మరోసారి రుజువైంది. విజయసాయి రెడ్డిపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రఘురామ. కొత్త ఆరోపణలను సంధించారు. వాడు, వీడు అంటూ విజయసాయి రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు. ఘాటు పదాలతో చెలరేగిపోయారు.

విశాఖ నుంచి గెంటేసినా..
విజయసాయి రెడ్డిని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి గెంటేసి, అండమాన్ నికోబార్కు పంపించినా మళ్లీ వచ్చాడని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. ఇటీవలే విజయసాయి రెడ్డి అండమాన్లో పర్యటించిన సందర్భంగా అక్కడి కేంద్ర కారాగారాన్ని ఆయన సందర్శించిన విషయం తెలిసిందే. ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి..అంటూ ధ్వజమెత్తారు. రేపో మాపో వీడు కూడా నా దారే పడతాడు.. అంటూ జోస్యం చెప్పారు. ఈ ఉదయం విజయసాయి రెడ్డి తనను విమర్శిస్తూ చేసిన ట్వీట్కు రఘురామ రిప్లై ఇచ్చారు.

చీప్ పబ్లిసిటీ కోసం..
అంతకుముందు- రఘురామ కృష్ణంరాజును విమర్శిస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. నర్సాపురానికి వస్తానని హామీ ఇచ్చి, హైదరాబాద్లో ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లిపోయిన ఉదంతాన్ని గుర్తు చేశారు. గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే రఘురామ కృష్ణంరాజు అనుకుంటున్నాడని విజయసాయి రెడ్డి ఆరోపించారు. తనను హత్య చేయడానికి జార్ఖండ్ నుంచి మనుషులను పంపించారంటూ రఘురామ కృష్ణంరాజు చేసిన ప్రకటనలను విజయసాయి రెడ్డి తప్పు పట్టారు.

పబ్లిసిటీ స్టంట్..
ఢిల్లీలో కూర్చొని 'నన్ను చంపేస్తారు' అని ఏడుపు మొదలెట్టాడని ధ్వజమెత్తారు.నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్ అని మండిపడ్డారు. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లో దూకి.. తనను ఎవరో తోసేశారు అనే రకం అంటూ రఘురామపై నిప్పులు చెరిగారు. తనను చంపుతారంటూ రఘురామ చెప్పుకోవడం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, ఇలాంటి చీప్ ట్రిక్స్ పని చేయవంటూ సాయిరెడ్డి విమర్శించారు.












Click it and Unblock the Notifications