పొన్నాల ఇంటికి రేణుకా చౌదరి, రేగా: నాయక్ గుస్సా
హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి కాంగ్రెసు నేత రేణుకా చౌదరి రావడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంటు సీటును సిపిఐకి కేటాయించడంపై పార్టీ అధిష్టానం మీద విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
సీట్ల కేటాయింపులో లంబాడీలకు అన్యాయం జరిగిందని రేణుకా చౌదరి విమర్శించారు. రేణుకా చౌదరి అనుచరులు ఆందోళనకు దిగారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్ వారితో వాగ్వివాదానికి దిగారు. రేగా కాంతారావును డిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై రేణుకా చౌదరి పొన్నాలను ప్రశ్నించారు.
పొన్నాల లక్ష్మయ్య ఇంటి వద్ద కాంగ్రెసు శాసనసభ్యుడు రేగా కాంతారావు సంచలనం సృష్టించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసును నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆయన అన్నారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి ప్రయత్నించారు.
తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రేగా కాంతారావు చెప్పారు. రేగా కాంతారావును బలరాం నాయక్ బలవంతంగా పొన్నాల నివాసంలోకి తీసుకని వెళ్లారు. తమ కష్టాలు మీడియా ప్రతినిధులకు ఏం తెలుసునని బలరాం నాయక్ ఈ సందర్భంగా అన్నారు. మీడియాపై కాస్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.