బీజేపీXటీఆర్ఎస్: మేంలేమా అని కిషన్, మొదలుపెట్టకుండానా అని తలసాని
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేతల మధ్య బుధవారం మాటల యుద్ధం నడిచింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధికార పార్టీపై నిప్పులు చెరగగా, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కమలం పార్టీ పైన దుమ్మెత్తి పోశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ది నియంతృత్వ ధోరణి అన్నారు. విపక్షాలే ఉండొద్దని కేసీఆర్ కోరుకుంటున్నారని, తెలంగాణ కోసం బీజేపీ పోరాటం చేయలేదా? అని ప్రశ్నించారు.
ఓడిపోయిన వారిని మంత్రులు చేశారని దుయ్యబట్టారు. విపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వరా అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అక్రమ పద్ధతుల్లో పన్ను వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనికి నిరసనగా తాము ఎల్లుండి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.
తాము ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లామని, ఎందుకు అరెస్టు చేశారో తెలియదన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రా్ట్రానికి ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పదేళ్ల నుండి ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోని రాహుల్.. ఇప్పటికైనా తప్పు చేశామని అంగీకరించాలన్నారు.
మరోవైపు బీజేపీపై తలసాని మండిపడ్డారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చేపడుతున్నామని, బీజేపీ నాయకులు అనవసర విమర్శలు చేయవద్దన్నారు. అస్తిత్వం కోల్పోతామనే భయంతో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు.
అసలు ప్రారంభం కాని పనుల విషయంలో నిధులు దుర్వినియోగం అని ఎలా అంటారని ప్రశ్నించారు. దేశంలోనే ఎవరు చేయని విధంగా వినూత్న పద్ధతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. రాజకీయాలు అందరూ పక్కన పెట్టి అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
మరోవైపు, రాహుల్ గాంధీ పైన పెద్దపెల్లి ఎంపీ బాల్క సుమన్ నిప్పులు చెరిగారు. రాహుల్ది రైతు భరోసా యాత్ర కాదని, కాంగ్రెస్ భరోసా యాత్ర అని ఎద్దేవా చేశారు. వడగండ్ల వాన పడితే అమేథీలో పర్యటించకుండా రాహుల్ తెలంగాణలో పర్యటించడం విడ్డూరమన్నారు. ఏ అధికార హోదాతో నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు.