'బెజవాడ గడ్డ'పై బాబు సవాల్: జగన్కు కేసీఆర్ తోడు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుల మధ్య పరోక్ష మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరువురు నేతలు ఒకరి పైన మరొకరు ధీటుగా స్పందిస్తున్నారు. శ్రీశైలం జల విద్యుత్ విషయంలో కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం కేసీఆర్ మాట్లాడుతూ... తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు రైతు రుణమాఫీ చేశానని, చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు చేయలేదని, తాను సాధ్యమనుకునే హామీలే ఇచ్చానని, బాబు మాత్రం అలా కాదని మండిపడ్డారు. తాను రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పానని, కానీ డ్వాక్రా రుణాలు చేయనని ముందే చెప్పానని తెలిపారు.
అదే సమయంలో చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ఇప్పటి వరకు చేయలేదని ఆరోపించారు. దీని పైన శనివారం చంద్రబాబు ధీటుగా స్పందించారు. శ్రీశైలం నీటి పైన రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రానికి తాము 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామంటే వినలేదని ఆరోపించారు.
కేసీఆర్ ప్రతి దానిని వివాదం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీకి స్బంధించి తొలి విడతలో ఏ రైతుకు ఎంత సొమ్ము జమ అవుతుందనే విషయం అతి త్వరలోనే ఎవరైనా ఆన్ లైన్లో చూసుకోవచ్చునని తెలిపారు. మాఫీ లెక్కలను త్వరలో నెట్లో పెడతామని చెప్పారు.
ఇదిలా ఉండగా, ఆదివారం కేసీఆర్ ఏపీ సీఎం పైన మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈసారి మరో అడుగు ముందుకేసి.. తాము అవసరమైతే విజయవాడలో రైతుల తరఫున భారీ బహిరంగ సభను పెట్టి, చంద్రబాబు కుతంత్రాన్ని బయటపెడతామని హెచ్చరించారు. రైతుల పక్షాన పోరాడుతామన్నారు. తాము ఇక్కడి రైతులకు రుణమాఫీ చేశామన్నారు.
కేసీఆర్ బెజవాడ వ్యాఖ్యల పైన చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. ప్రజల సమస్యల పైన పోరాడేందుకు కేసీఆర్ విజయవాడకు రావొచ్చునని తెలిపారు.
కాగా, ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చంద్రబాబు పైన ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో కృష్ణా బోర్డు చైర్మన్ పండిట్ పైన నిప్పులు చెరిగారు. ఆయన ఓ సన్నాసి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెడ మీద తలకాయ ఉన్న ఏ ఒక్కరు అలాంటి తీర్పులు ఇవ్వాలని, అలాగే అలాంటి తీర్పును స్వాగతించరని ఘాటుగా స్పందించారు.
ఛత్తీస్గఢ్లో కేసీఆర్కు ఘన స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఛత్తీస్గఢ్లో ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ ఆదివారం నయా రాయపూర్లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో దిగగానే ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాజేష్ ముదత్ ఘన స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.
కేసీఆర్ను 25 వాహనాల భారీ కాన్వాయ్ మధ్య ఆయన కోసం ఏర్పాటు చేసిన విడిదికి తీసుకు వెళ్లారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో తెలంగాణకు విద్యుత్ సరఫరా ఒప్పందం చేసుకునే నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎనిమిది మంది ఉన్నతాధికారుల బృందం ఛత్తీస్ గఢ్ వెళ్లారు.