'రామ్ గోపాల్ వర్మకు దమ్ముంటే కడప వచ్చి మాట్లాడాలి'
విజయవాడ: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దమ్ముంటే కడపకు వచ్చి మాట్లాడాలని ఉక్కు ఫ్యాక్టరీ సాధనా సమితి నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి గురువారం సవాల్ చేశారు.
ఆయన విజయవాడలో మాట్లాడారు. కాసుల కోసం ఎప్పుడో జరిగిన ఘటనలను చూపిస్తే మళ్లీ కక్షలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన వాపోయారు.
రామ్ గోపాల్ వర్మ పైన కేసు నమోదు చేసి కడప వెబ్ సిరీస్ను నిలిపివేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సిరీస్ రాకుండా చూడాలని కోరారు.
కడప పేరుతో రాయలసీమ ఫ్యాక్షనిజంపై వర్మ వెబ్ సిరీస్ను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీమ నేతలు భగ్గుమంటున్నారు. దీనిని ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
వర్మ మాత్రం తన సిరీస్ ఆగదని చెబుతున్నాడు. వెబ్ సిరీస్ కడప టైటిల్ సాంగ్ను మంగళవారం ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. సిరాశ్రీ రాసిన పాటలోని లిరిక్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.