ఆఫర్ వచ్చిందా: పవన్ కల్యాణ్ రాజ్యసభ సీటు వదిలేశారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వదులుకున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ ఆత్మగౌరవ సభలో ఆయన శుక్రవారం ఆ విషయాన్ని బయట పెట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన టిజి వెంకటేష్ను ప్రస్తావిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు.
జనసేన వద్దనుకున్న సీటులో టీజీ వెంకటేష్ కూర్చున్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. తనపై టిజి వెంకటేష్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన ఆ మాటన్నారు. వెంకటేష్ తన గురించి చాలా మాట్లాడారని, తలుచుకుంటే తాను కూడా చాలా మాట్లాడగలనని అన్నారు. ఈ సందర్భంగా టిజీ వెంకటేష్పై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభ సీటును పవన్ కల్యాణ్కు ఇవ్వడానికి బిజెపి ముందుకు వచ్చిందా, చంద్రబాబు ముందుకు వచ్చారా అనేది తెలియడం లేదు. అయితే, టిజి వెంకటేష్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు కాబట్టి చంద్రబాబే ముందుకు వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.

రాజకీయ వ్యూహంలో భాగంగానే చంద్రబాబు పవన్ కల్యాణ్కు రాజ్యసభ సీటు ఇవ్వాలని ముందుకు వచ్చారని భావించవచ్చు. గతంలో రాజ్యసభ సీటు ఇవ్వకపోవడం వల్లనే కాంగ్రెసును తుడిచిపెట్టే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా దుమారం రేపారనే అభిప్రాయం ఉంది. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు కారణమయ్యారని భావిస్తూ ఉంటారు.
పవన్ కల్యాణ్ను రాజ్యసభకు పంపిస్తే అటువంటి ప్రమాదం నుంచి బయటపడవచ్చునని భావించి ఉంటారని అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తలదూర్చకుండా ఉంటారనే అభిప్రాయం కావచ్చు. ఏమైనా, పవన్ కల్యాణ్ మాత్రం తనకు పదవులపై వ్యామోహం లేదని చెప్పుకోవడానికి ఆ ప్రస్తావన పనికి వచ్చింది.












Click it and Unblock the Notifications