చంద్రబాబుకు తలనొప్పి: గుంటూరు-ప్రకాశం మధ్య నీటి గొడవ
హైదరాబాద్: ఏపీలో గుంటూరు, ప్రకాశం జిల్లా రైతుల మధ్య నీటి వివాదం రగులుకుంది. ఈ వివాదం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం 85వ మైలురాయి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సాగర్ కాలువ నీటిని గుంటూరు జిల్లా రైతులు మళ్లించారు. దీనిని ప్రకాశం జిల్లా ఎన్ఎస్పీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గుంటూరు జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ఒంగోలు ఎమ్మెల్యే మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు దృష్టికి తీసుకు వెళ్లారు.
విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఆ తర్వాత ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లారు.
తమకు అత్యవసరంగా నీరు కావాలని గుంటూరు జిల్లా ప్రజలు, పలువురు ప్రజా ప్రతినిధులు సాగర్ కెనాల్ లాకులను తీసేందుకు ప్రయత్నించారు. అలా చేస్తే తమకు రావాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా రాదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమతో ఫోన్లో మాట్లాడారు.
లాకులు తీసివేస్తే ప్రజల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అనంతరం పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు.
అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు సంయమనం పాటించాలని, నీటి అవసరాలను తీర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా, లాకుల వద్ద ఓవైపు గుంటూరు, మరోవైపు ప్రకాశం జిల్లా పోలీసులు మోహరించారు.