దేశమంతా చూస్తోంది: వాటర్ గ్రిడ్పై కెసిఆర్, పాలమూరు, నల్లగొండలకే తొలుత
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్గ్రిడ్ నిర్మాణాన్ని దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తెలిపారు. సచివాలయంలో వాటర్గ్రిడ్పై సీఎం కేసీఆర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడంతో పాటు అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు, కరువు పీడిత మహబూబ్నగర్ జిల్లాకు మొదటగా మంచి నీరు అందించాలని, పనులు వేగంగా, పారదర్శకంగా జరగాలని అన్నారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, సవాలుగా తీసుకుని వాటర్గ్రిడ్ నిర్మాణం చేపడుతోందని, అధికార యంత్రాంగం కూడా అదే పట్టుదలతో పని చేయాలని, 15 రోజుల్లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన అన్నారు. దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు టెండర్లలో పాల్గొనే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.
26 ప్యాకేజీలను నాలుగైదు భాగాలుగా విభజించుకుంటే పనులను సమీక్షించడం సులువుగా ఉంటుందని, పనులలో వేగం పెంచడంతో పాటు నాణ్యత విషయంలో కూడా రాజీ పడవద్దని ఆయన అన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించిన తర్వాత నిపుణుల కమిటీకి కూడా పరిశీలన కోసం పంపి సూచనలు తీసుకోవాలని అన్నారు.
పలు సంస్థలు పెట్టుబడులు
ఇప్పటికే వాటర్గ్రిడ్ కోసం పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం కూడా ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధంగా ఉందని కెసిఆర్ అన్నారు. హడ్కో, నాబార్డు నుంచి ఇప్పటికే రూ. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి ఒప్పందాలు కుదిరాయనిస ఈ సంస్థలే మరో 7 వేల కోట్ల రూపాయాల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని చెప్పారు. ఇతరత్రా నిధులు కూడా వస్తున్నాయనిస కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేర నిధులు అందుతాయని, ఎక్కడ నిధులు అవసరమైనా సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
వివిధ స్థాయిల్లో వాటర్గ్రిడ్ పైపులైన్లకు 311 చోట్ల రైల్వే లైన్లు అడ్డు వస్తున్నాయని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పైపులైన్లు రైల్వే లైన్ క్రాస్ చేయడానికి అనుగుణంగా నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని రైల్వే జీఎంను సీఎం కోరారు. రెండు, మూడు రోజుల్లో రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశం కానున్నారు.