Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు బారీగా వరద-తాజా దృశ్యాలివే..!
ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగుతోంది. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. స్పిల్ వేపైకి భారీగా నీరు వస్తుండటంతో గేట్లు తెరిచి కిందకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాష్టంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరదతో పోలవరం ప్రాజెక్టు వద్ద జలకళ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో 48 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 26.700 మీటర్లు, స్పిల్వే దిగువన 16.720 మీటర్లు, కాపర్ డ్యామ్ కు ఎగువన 26.800 మీటర్లు, కాపర్ డ్యాంకి దిగువన 15.690 మీటర్లు నీటిమట్టం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 6.018 క్యూసెక్కుల గోదావరి వరద జలాలను పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. పట్టిసీమలో గోదావరి నీటిమట్టం 14.802 మీటర్లకు చేరుకోవడంతో, 17 పంపులు 17 మోటార్లతో నీటిని విడుదల చేసినట్లు వారు తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకూ 2.4060 టీఎంసీల నీటిని విడుదల చేశారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశముంది.












Click it and Unblock the Notifications